నేడే వైసీపీ ఎంపీల రాజీనామాలు, టిడిపి సైకిల్ ర్యాలీలు, పవన్ పాదయాత్ర
అమరావతి:ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్తో రాజకీయపార్టీల ఆందోళనలు చివరి అంకానికి చేరుకొన్నాయి. పార్లమెంట్ శుక్రవారం నాడు నిరవధికంగా వాయిదా పడే అవకాశం ఉన్నందున వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసి ఏపీ భవన్ వేదికగా ఆమరణ నిరహరదీక్షకు దిగనున్నారు. మరో వైపు ఏప్రిల్ 7న, అఖిలపక్ష సమావేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జనసేన, లెఫ్ట్పార్టీలు పాదయాత్రలకు పిలుపునివ్వగా, టిడిపి సైకిల్ ర్యాలీలు చేయనుంది.
టిడిపిని అందుకే వ్యతిరేకించా, విభజన ఉద్యమాలు, 200 ఎకరాలు చాలు: పవన్
ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్తో అధికార, విపక్షాలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రత్యేక హోదా అంశాన్ని తీసుకొని రాజకీయంగా ప్రయోజనం పొందాలని రెండు పార్టీలు భావిస్తున్నాయి.
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కూడ లెఫ్ట్పార్టీలతో కలిసి ప్రత్యేక హోదా పోరాటంలో పాల్గొంటున్నాడు.ఏపీలో రాజకీయ పరిణామాల్లో వేగంగా మార్పులు సంభవించే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
చివరి అంకానికి చేరిన పార్టీల పోరాటం
ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్తో రాష్ట్రానికి చెందిన పార్టీలు చేస్తున్న పోరాటాలు చివరి అంకానికి చేరుకొన్నాయి. పార్లమెంట్ సమావేశాలు శుక్రవారంతో ముగిసే అవకాశం ఉంది. పార్లమెంట్ ఉభయసభలు శుక్రవారంనాటితో నిరవధికంగా వాయిదా పడితే వైసీపీ ఎంపీలు స్పీకర్ ఫార్మాట్లోనే రాజీనామాలు చేయనున్నారు.ఏపీ భవన్ వేదికగా దీక్షలకు దిగనున్నారు. గురువారం నాడు రాజ్యసభలో, పార్లమెంట్ సెంట్రల్ హల్లో టిడిపి ఎంపీలు నిరసనలకు దిగారు. టిడిపి ఎంపీలు కూడ నిరసన కార్యక్రమాలకు ప్లాన్ చేస్తున్నారు. ఏపీ భవన్లో వైసీపీ ఎంపీల దీక్షకు ప్రభుత్వం అనుమతిచ్చింది.
పార్టీల నిరసనలు
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్తో రాజకీయపార్టీలు పలు రకాల ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి. ఏప్రిల్ 6న, రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి సైకిల్ ర్యాలీలు చేపట్టాలని నిర్ణయం తీసుకొంది. రాజధానిలో సైకిల్ ర్యాలీని చంద్రబాబునాయుడు ప్రారంభిస్తారు. టిడిపి ప్రజా ప్రతినిధులంతా అసెంబ్లీకి సైకిల్ ర్యాలీ ద్వారా రానున్నారు. జనసేన, సిపిఐ, సీపీఎంలు ఏప్రిల్ 6న, రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు నిర్వహిస్తారు. పాదయాత్రలో పవన్ కల్యాణ్, సీపీఎం మధు, సీపీఐ రామకృష్ణ పాల్గొననున్నారు. రామవరప్పాడు వరకు యాత్ర కొనసాగనుంది. అదే విధంగా విభజన హామీలు నెరవేర్చాలని తెలంగాణలోనూ జనసేన ఆందోళనలు చేపట్టనున్నారు. రేపు రాష్ట్ర రహదారులపై కార్యకర్తలు పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకున్నారు.. వైసీపీ ఎంపీలు ఏపీ భవన్లో దీక్షలకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు చేయాలని వైసీపీ పిలుపునిచ్చింది.
విపక్షాలకు చెక్
ఏపీ రాష్ట్రంలో విపక్షాలను ఇరుకున పెట్టేలా టిడిపి వ్యూహరచన చేసింది. ఏప్రిల్ 7న, ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి రావాలని మంత్రులను విపక్షపార్టీల నేతల వద్దకు పంపాలని చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకొన్నారు. గత అఖిలపక్ష సమావేశానికి హజరుకాని మూడు పార్టీల నేతల వద్దకు మంత్రులను పంపి ఆల్ పార్టీ మీటింగ్కు రావాలని బాబు సమాచారాన్ని పంపనున్నారు. ఏప్రిల్ 6న, మంత్రులు ఈ మూడు పార్టీల నేతలను ప్రత్యేకంగా కలిసి ఆహ్వనించనున్నారు.అయితే గతంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి హజరుకాని ఈ మూడు పార్టీలు ఈ సమావేశానికి హజరౌతాయా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది.
టిడిపి ఏం చేయనుంది
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ తో వైసీపీ ఎంపీలు రాజీనామాలతో పాటు ఆమరణ దీక్షలకు దిగనున్నారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కూడ ఆమరణ దీక్షకు దిగుతానని ప్రకటించారు. ఎంపీల రాజీనామాల విషయమై టిడిపి సానుకూలంగా ఉన్నట్టు సంకేతాలు ఇవ్వలేదు. అయితే పార్లమెంట్ వాయిదా పడిన తర్వాత ఎంపీలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణను చంద్రబాబునాయుడు ప్రకటించనున్నారు. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మగౌరవ బస్సు యాత్ర చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని ప్లాన్ చేశారు.