జగన్ పార్టీ దాడి, మనస్తాపంతో మహిళా నేత ఆత్మహత్య

ఈమె టిడిపి మద్దతుతో కంబదూరు మండలం మర్రిమాకులపల్లి 4వ వార్డు మెంబర్గా గెలుపొందారు. ఈ నెల 3వ తేదీన ఆమె పైన దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత 5న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి తిప్పేస్వామి గ్రామంలోకి ప్రచారం నిమిత్తం వచ్చారు. అదేరోజు గ్రామానికి చెందిన ఇద్దరు మరో పదిమంది జగన్ పార్టీ కార్యకర్తలు వార్డు మెంబర్ అనితపై దాడి చేసి చితకబాదారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి మద్దతివ్వకపోతో అంతు చూస్తామని బెదిరించారట. దీనిపై బాధితురాలు అదే రోజు కంబదూరు ఎస్ఐకి రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయినా పోలీసులు పట్టించుకోలేదట. పోలీసులకు ఫిర్యాదు చేస్తావా అంటూ మరోసారి వారు దాడి చేశారట. తిరిగి గురువారం కూడా దాడికి పాల్పడతారని సమాచారం అందడంతో భయాందోళనలకు గురైన అనిత ఇంట్లోనే పురుగుల మందు తాగింది.
అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతిచెందింది. దీనిపై కంబదూరు ఎస్ఐ శ్రీధర్ను వివరణ కోరగా.. ఫిర్యాదు చేసిన మాట వాస్తవమేనన్నారు. వారి ఫిర్యాదు మేరకు గ్రామానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించామన్నారు. మళ్లీ దాడి జరిగిన సంగతి తమ దృష్టికి రాలేదన్నారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే అనిత మృతి చెందిందని టిడిపి శాసన సభ అభ్యర్థి ఆరోపించారు.












Click it and Unblock the Notifications