5 రోజుల్లోనే అక్కడ సాధారణ స్థితి.. అదే టీడీపీ ఉంటే 50 రోజులు పట్టేది.. : టీడీపీపై బొత్స విమర్శలు
విశాఖలోని గ్యాస్ లీకేజీ గ్రామాల్లో రెండు రోజులుగా సాధారణ పరిస్థితి నెలకొందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఎరవరికీ ఎలాంటి సమస్యలు రాకుండా ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరిస్తూ.. దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు సాగుతోందన్నారు. మరో రెండు రోజుల్లో మిగిలినవారికి కూడా పరిహారం అందుతుందని హామీ ఇచ్చారు.

టీడీపీ ఉంటే 50 రోజులు పట్టేది..
ఎల్జీ పాలిమర్స్ సంఘటన గురించి తెలియగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన విశాఖకు వచ్చి బాధితులను పరామర్శించారని గుర్తుచేశారు. వారికి భరోసా ఇచ్చి మంత్రులను కూడా ఇక్కడే ఉండి పర్యవేక్షించమని ఆదేశాలిచ్చారన్నారు. కేవలం ఐదురోజుల్లోనే సమస్య నుంచి సాధారణ పరిస్థితులు నెలకొనేలా చేశారని.. అదే టీడీపీ ఉంటే 50 రోజులు పట్టేదని విమర్శించారు. ఎందుకంటే.. వారికి పని కంటే పబ్లిసిటీ ముఖ్యమని ఎద్దేవా చేశారు.

టీడీపీ జూమ్ పార్టీలా మారిపోయింది..
ఎల్జీ పాలిమర్స్ ఘటనకు సంబంధించి ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపడుతుంటే.. ఒక్క టీడీపీ నేత కూడా ముందుకు వచ్చి సహాయం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు ప్రజల్లోకి రారని.. కనీసం కరోనా కష్టకాలంలో దోచుకున్న డబ్బులో ఒక్క రూపాయి కూడా సాయం చేయరని విమర్శించారు.టీడీపీ ఒక జూమ్ పార్టీలా మారిపోయిందని ఎద్దేవా చేసిన బొత్స.. ప్రజలను ఆదుకోవాల్సిన సమయంలో జూమ్ ద్వారా మెసేజ్లు చేస్తూ ప్రభుత్వంపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తాము బ్రహ్మాండంగా పనిచేశామని ప్రశంసించక్కర్లేదని.. కనీసం వాస్తవాలు చెబితే చాలునని హితవు పలికారు.

నివేదిక వచ్చాక తగిన నిర్ణయాలు..
ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీపై హైపవర్ కమిటీ విచారణ జరుపుతోందని, నివేదిక వచ్చిన తర్వాత తగిన నిర్ణయాలు తీసుకుంటామని బొత్స స్పష్టం చేశారు. ఆ ప్రాంతంలో విషవాయువు తీవ్రత తగ్గిందని నిపుణులు నిర్దారించాకే ప్రజలను గ్రామాల్లోకి తీసుకెళ్లామని చెప్పారు. రేపటితో గ్రామాల్లో సర్వే పూర్తవుతుందన్నారు. ప్రభుత్వ పరిహారం వారికి అందేంతవరకు భోజన ఏర్పాట్లు కొనసాగించాల్సిందిగా అధికారులను ఆదేశించామన్నారు. బాధితుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎప్పుడు వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications