ప్రతి ఉద్యోగికీ ఆప్షన్, టీ ఫైర్: పోస్టులకు మించి ఉంటే..
హైదరాబాద్: ప్రతి ఉద్యోగికీ ఆప్షన్ ఇవ్వాలన్న కమల్ నాథన్ కమిటీ నిర్ణయం పైన తెలంగాణ ఉద్యోగులు మండిపడుతున్నారు. కమల్ నాథన్ కమిటీ ఉద్యోగి సర్వీసు రిజిస్టర్లో ఉన్న స్థానికతనే ఉద్యోగుల విభజనకు ప్రామాణికంగా తీసుకోవాలని సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చింది.
అదనపు ఉద్యోగులను తీసుకోవడానికి ఈ ఆప్షన్లను ప్రామాణికంగా తీసుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు ఇరు రాష్ట్రాల్లో ఉద్యోగుల విభజన, పంపిణీపై కేంద్రం నియమించిన సలహా కమిటీ ముసాయిదా మార్గదర్శకాలను ఖరారు చేయనుంది. రెండు మూడు రోజుల్లో వాటిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వెబ్సైట్లలో ఉంచనుంది.
పది రోజుల్లో ఉద్యోగులు తమ సలహా సూచనలను ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తంమీద ఉద్యోగుల పంపిణీ ప్రక్రియను మొదలు పెట్టేందుకు మరికొంత సమయం పట్టే అవకాశముంది. అలాగే, ప్రతి ఉద్యోగికి ఆప్షన్ ఇవ్వాలన్న కమిటీ నిర్ణయాన్ని బట్టి ఏ రాష్ట్ర ఉద్యోగులు ఆ రాష్ట్రంలోనే పని చేయాలన్న నిబంధనను అమలు చేయడం ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చని అంటున్నారు. పోస్టులకు మించి ఉద్యోగులు ఉంటే మరో రాష్ట్రంలో పని చేయాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు.
కమిటీ చైర్మన్ కమల్ నాథన్ అధ్యక్షతన డీవోపీటీ సంయుక్త కార్యదర్శి అర్చనా వర్మ, కిప్జెన్, ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఐవైఆర్ కృష్ణారావు, రాజీవ్ శర్మ తదితరులు సోమవారం సచివాలయంలోని ఎల్ బ్లాకులో సమావేశమయ్యారు. ఉద్యోగుల పంపిణీపై మార్గదర్శకాలు ఎలా ఉండాలన్న అంశంపై దాదాపు మూడున్నర గంటలపాటు చర్చించారు.
అనంతరం కమిటీ చైర్మన్ కమల్ నాథన్ విలేకరులతో మాట్లాడారు. ప్రతి ఉద్యోగికి ఆప్షన్ ఉంటుందని, సచివాలయంతోపాటు రాష్ట్రస్థాయి, మల్టీ జోన్లలో పని చేసే ఉద్యోగులు రెండు రాష్ట్రాల్లోనూ ఆప్షన్ కోరుకోవచ్చని చెప్పారు. ఈ మేరకు తాత్కాలిక మార్గదర్శకాలను రూపొందించి రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వెబ్సైట్లలో ఉంచుతామని వెల్లడించారు.
వీటిని చూసుకున్న తర్వాత వారి అభిప్రాయాలతోపాటు సలహా, సూచనలను పది రోజుల్లో తమకు తెలియజేయాల్సి ఉంటుందన్నారు. వాటిని పరిగణనలోకి తీసుకుని ఆ తర్వాత వారం రోజుల్లో తుది మార్గదర్శకాలను రూపొందించి కేంద్రానికి పంపిస్తామన్నారు. కేంద్రం అమోదించిన తర్వాత ఉద్యోగుల విభజన, పంపిణీ ప్రక్రియను చేపడతామన్నారు.
ఉద్యోగులను వర్కింగ్ స్ట్రెంత్ ఆధారంగా కాకుండా శాంక్షన్ స్ట్రెంత్ ఆధారంగా విభజించాలని కమల్ నాథన్ కమిటీని తాము కోరామని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ చెప్పారు. తమ వాదనతో కమల్ నాథన్ ఏకీభవించారన్నారు. వర్కింగ్ స్ట్రెం థ్ ఆధారంగా విభజన ఇరు ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సరిగా జరగకపోవడానికి కారణమైందన్నారు.
దేవీప్రసాద్, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో టీఎన్జీవో, టీజీవో, పలు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు మంగళవారం సచివాలయంలో కమల్ నాథన్ కమిటీని కలిసి తమ వాదనలను వినిపించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల విభజన స్థానికత ఆధారంగా జరగాలని, స్థానికతను నిర్థారించడంలో గిర్గ్లానీ కమిటీ సూచనలను పాటించాలని సూచించామన్నారు.
తెలంగాణ ఉద్యోగులు అధికంగా ఉన్నచోట సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించాలని చెప్పామన్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన నాలుగో తరగతి ఉద్యోగులందరినీ బేషరతుగా తెలంగాణ రాష్ట్రానికే కేటాయించాలని కోరామన్నారు. సీఎస్ రాజీవ్ శర్మకూ ఇదే విషయాన్ని చెప్పామన్నారు. ఆగస్టు 30కల్లా ఉద్యోగుల విభజనను పూర్తి చేయాలని కోరామని విఠల్ అన్నారు.