పోలవరం ప్రాజెక్ట్ పై ముగిసిన భేటీ: ఏపీపై మూకుమ్మడి దాడి; తెలంగాణా తీవ్ర అభ్యంతరం!!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ సమావేశం నిర్వహించింది. ఈ కీలక సమావేశానికి ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల సీఎస్ లు, జల వనరుల శాఖ అధికారులు హాజరయ్యారు. కేంద్ర జల శక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్, కేంద్ర అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శి రామేశ్వర గుప్త అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నాలుగు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, జలవనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు ముంపు, బ్యాక్ వాటర్ పై ఈరోజు కేంద్ర జల శక్తి శాఖ ఆధ్వర్యంలో వర్చువల్ సమావేశం వాడీ వేడిగా సాగింది.
పోలవరం ప్రాజెక్ట్ పై థర్డ్ పార్టీతో విచారణ జరిపించాలన్న తెలంగాణా
పోలవరం బ్యాక్ వాటర్ వల్ల తెలంగాణ రాష్ట్రానికి ముప్పు పొంచి ఉందని, బ్యాక్ వాటర్ ప్రభావంపై థర్డ్ పార్టీతో విచారణ జరిపించాలని తెలంగాణ రాష్ట్రం డిమాండ్ చేసింది. పోలవరం ముంపు సమస్యలపై రజత్ కుమార్ బలంగా తన వాదనను వినిపించారు.అంచనాకు మించి ముప్పు వాటిల్లుతుందని గణాంకాలతో సహా కేంద్ర జల శక్తి శాఖ ముందు వినిపించారు. చారిత్రక ప్రదేశాలు, పవర్ ప్లాంట్ ముంపునకు గురయ్యే అవకాశం ఉందని తెలిపారు.ముంపు నివారణ చర్యలు చేపట్టాలని తెలంగాణ నీటిపారుదల శాఖ కేంద్ర జల శక్తి శాఖను కోరింది.
ప్రజాభిప్రాయ సేకరణ కూడా చెయ్యలేదన్న చత్తీస్ గడ్, ఒరిస్సా
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని, దీనివల్లనే ముంపు సమస్య కూడా తీవ్రంగా ఉందని కేంద్ర జల శక్తి శాఖకు మూడు రాష్ట్రాలు తెలిపాయి. పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ విషయంలో ఒడిస్సా, చతిస్గడ్, తెలంగాణ రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశాయి. తమ రాష్ట్రంలో ఇప్పటివరకు ఎటువంటి ప్రజాభిప్రాయ సేకరణ జరగలేదని, ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టకుండానే పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్నారని ఒడిస్సా, చత్తీస్ గడ్ అభ్యంతరాన్ని తెలిపాయి.
ఏపీ ప్రభుత్వంపై మూకుమ్మడి దాడి.. మళ్ళీ వచ్చే నెల 7వ తేదీన భేటీ
పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని అన్ని రాష్ట్రాలు డిమాండ్ చేశాయి. అంతేకాదు ముంపు నివారణకు రక్షణ చర్యలు సత్వరమే చేపట్టాలని డిమాండ్ చేశాయి. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై మూడు రాష్ట్రాలు మూకుమ్మడిగా దాడి చేశాయి.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో పక్క రాష్ట్రాలకు ముప్పు వాటిల్లుతున్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మాణంలో తనదైన పంథా కొనసాగిస్తుందని, మూడు రాష్ట్రాలు మూకుమ్మడిగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై విరుచుకు పడ్డాయి. ఇక మూడు రాష్ట్రాల అభ్యంతరాలు విన్న కేంద్ర జల శక్తి శాఖ వచ్చేనెల 7వ తేదీ మరోమారు ఈ వ్యవహారంలో భేటీ కావాలని నిర్ణయం తీసుకుంది.