కిరణ్ ప్రోరోగ్పై టి ఫైర్: రెచ్చగొట్టొద్దని హరీష్రావు, విహెచ్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి 'ప్రోరోగ్'పై తెలంగాణ ప్రాంత నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కిరణ్ నియంతలా వ్యవహరిస్తున్నారని, అసెంబ్లీని ప్రోరోగ్ చేయాలని స్పీకర్ నాదెండ్ల మనోహర్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభ్యుడు హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్దంగా జరుగుతున్న విభజనకు అడ్డుపడవద్దని కోరారు. ఎవరెన్ని కుట్రలు చేసినా విభజన ఆగదన్నారు. ఆర్టికల్ 371 డి తెలంగాణకు అడ్డు కాదన్నారు.
ముఖ్యమంత్రి తెలంగాణ ద్రోహి అని తెరాస నేత, పెద్దపల్లి ఎంపి వివేక్ ధ్వజమెత్తారు. సీమాంధ్ర ప్రజలను కూడా కిరణ్ మోసం చేస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీని ప్రోరోగ్ చేయాలనడం దారుణమన్నారు. చిత్తూరుకు అత్యవసరంగా నీళ్లు ఇవ్వాల్సిన అవసరమేముందన్నారు. తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి అవినీతిని బయటపెడతామన్నారు.

కిరణ్ రెచ్చగొడుతున్నారు: విహెచ్
నిన్నటి వరకు సీమాంధ్ర ప్రజలను రెచ్చగొట్టిన ముఖ్యమంత్రి ఇప్పుడు తెలంగాణ ప్రజలను రెచ్చగొడుతున్నారని కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు వేరుగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కిరణ్ రోజుకో మాట మాట్లాడుతున్నారని, చరిత్రహీనుడుగా మిగిలిపోవడం ఖాయమన్నారు.
కిరణ్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. రాయల తెలంగాణ ప్రతిపాదనకు తాము అంగీకరించేది లేదన్నారు. దేశంలో నరేంద్ర మోడీ, కిరణ్లను మించిన అబద్దాలకోరులు లేరన్నారు. విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ ఉచిత సలహాలు మాని వచ్చే ఎన్నికలలో ఎలా గెలవాలో ఆలోచించాలని సూచించారు. కిరణ్కు కనీస జ్ఞానం లేదని బిజెపి నేత నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications