నేనైతే సీఎంను కాలేను: టీ నేతల్ని ఊరిస్తున్న బాబు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో చురుగ్గా వెళ్లే వారికే ముఖ్యమంత్రి పదవి అంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ టీడీపీ నేతలను ఉత్సాహపరుస్తున్నారు. ఎన్టీఆర్ భవన్లో చంద్రబాబు టీ టీడీపీ నేతలతో సమావేశమయ్యారు. సుమారు 4 గంటలపాటు చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణలో తెరాస తర్వాతి స్థానంలో టీడీపీయే ఉందని, ఈ విషయం తన సర్వేలో స్పష్టమైందని చెప్పారు. చురుగ్గా దూసుకెళితే.. మీరే తదుపరి సీఎం అన్నారు.
రెండు ప్రాంతాల్లో రెండు ప్రభుత్వాల పని తీరుపై ప్రజాభిప్రాయం సేకరించానని, అటువైపు విషయాలు ఇక్కడ అక్కర్లేదు కాబట్టి చెప్పడం లేదని, తెలంగాణలో కాంగ్రెస్కన్నా మనమే మెరుగైన స్థితిలో ఉన్నామని, రాష్ట్రం విడిపోయినప్పటికీ, తన పని తీరు పట్ల ప్రజల్లో ఉన్న సానుకూలత మనకు ఉపయోగపడుతున్నట్లు సర్వేలో తేలిందని, విద్యుత్ సరఫరా విషయంలో తెలంగాణ ప్రభుత్వ పనితీరుపై 35 శాతం ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని చెప్పారు.
రుణ మాఫీపైనా 25 శాతం మందిలో అసంతృప్తి ఉందని, నీళ్లు, కరువు వంటి అంశాలపై 20 శాతం మంది ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారన్నారు. తెలంగాణలో టీడీపీకి ఉన్న కేడర్ మరే పార్టీకీ లేదన్నారు. తెలంగాణలో పార్టీ నేతలకు ఇప్పుడు ఒక సువర్ణ అవకాశం ఎదురుగా ఉందని, దానిని సద్వినియోగం చేసుకొంటే వారే భవిష్యత్ పాలకులుగా మారతారని చంద్రబాబు పేర్కొన్నారు. తానైతే తెలంగాణకు ముఖ్యమంత్రిని కాలేనని, మీలో ఎవరో ఒకరికి ఆ అవకాశం వస్తుందన్నారు.
దానిని దక్కించుకోవడం మీ చేతిలోనే ఉందన్నారు. చురుగ్గా పనిచేసి, ప్రజల్లోకి దూసుకు వెళ్లే వారికే అవకాశమని, తానుపార్టీ అధ్యక్షునిగా మీకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని, తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి తన సర్వ శక్తులూ వెచ్చిస్తానని భరోసా ఇచ్చారు. ఏపీలోని ముఖ్యమైన ట్రస్టు బోర్డుల్లో తెలంగాణ నేతలను కూడా నియమిస్తానని, కేంద్రంలోని నామినేటెడ్ పదవుల్లోనూ టీ- నేతలకు అవకాశం వస్తుందని ఆయన హామీ ఇచ్చారు. కాగా, ముగ్గురు టీ నేతలకు టీటీడీ బోర్డులోకి తీసుకోవచ్చునని తెలుస్తోంది.
తనకు తెలుగువారంతా ఒకటేనని, విభజన తర్వాత ఏపీ బాగా వెనకబడి పోయిందని, అందువల్లే అక్కడ అధికంగా సమయం కేటాయిస్తున్నానని, ఇక్కడ కూడా తన బాధ్యత ఉందని చెప్పారు. ఆరు వారాల్లోగా తెలంగాణలో అన్ని నియోజకవర్గాల్లో పార్టీ సమావేశాలు నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. దీనికోసం సీనియర్ నేతలతో పది బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి బృందం ప్రతి జిల్లా వెళ్లాలని, దానివల్ల సీనియర్లకు అన్ని జిల్లాలతో సంబంధాలు ఏర్పడతాయని చంద్రబాబు సూచించారు.