కావాలనే ఫెయిల్ చేశారు: టీలో 10వ తరగతి ఫలితాల వివాదం, డీఈవో ఆఫీస్పై దాడి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు వివాదాస్పదమవుతున్నాయి. ఫలితాలు వెలువడిన తర్వాత పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు బోర్డు పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే తక్కువ మార్కుల వేసి, పరీక్షలో ఫెయిల్ చేశారని మండిపడుతున్నారు.
సోమవారం ఆందోళన చేసిన విద్యార్థులు, తల్లిదండ్రులు.. మంగళవారం రెండో రోజు కూడా చేశారు. మంగళవారం నాడు హైదరాబాదులోని డీఈవో కార్యాలయంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు దాడి చేశారు. ఈ దాడిలో ఫర్నీచర్, అద్దాలు ధ్వంసమయ్యాయి.
అన్ని విషయాలలో (సబ్జెక్టుల్లో) పాస్ అయిన తమ పిల్లలు ఒకటి రెండు అంశాల్లో ఎందుకు ఫెయిల్ అయ్యారని ప్రశ్నిస్తున్నారు. తమ విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలపాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు, ఫెయిల్ అయిన పదో తరగతి విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలిపే ప్రసక్తి లేదని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చెప్పారు. బట్టీ విధానం, కాపీయింగ్కు ఆస్కారం లేకుండా సీసీఈ విధానం అమలు చేశామన్నారు. అయితే, విద్యార్థులు ఆ విధానానికి అలవాటు పడాల్సి ఉందన్నారు.
కాగా, టెన్త్ ఫలితాల పైన పలువురు రెండు రోజులుగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త విధానం పైన టీచర్లకే అవగాహన లేదని, వాళ్లు పిల్లలను ఎలా సిద్ధం చేయగలరని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. వారు రెండు రోజులుగా ప్రభుత్వ పరీక్షల విభాగం ఎదుట ధర్నా చేస్తున్నారు.