పట్టించుకోవద్దు: బాబు ముందు కేసీఆర్పై సెటైర్లు, నవ్వించారు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో శనివారం భేటీ అయిన తెలంగాణ టీడీపీ నేతలు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన మండిపడ్డారు. ఆయన పైన సెటైర్లు విసిరారు.
తెలంగాణ సీనియర్ టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర రావు, ఎల్ రమణ, రావుల చంద్రశేఖర రెడ్డిలు విలేకరుల సమావేశంలో, చంద్రబాబు ఎదుట కేసీఆర్ పైన చురకలు వేశారు.
ఎర్రబెల్లి దయాకర రావు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, మంత్రి కల్వకుంట్ల తారక రామారావుల గురించి ఓ కథ చెప్పి ఆకట్టుకున్నారు.
టీడీపీ
మా సీఎం మూర్ఖుడని, ఆయన మాటలు పట్టించుకోవద్దని, తెలంగాణలో రైతులు విద్యుత్ లేక ఇబ్బంది పడుతున్నారని, ఆత్మహత్య చేసుకుంటున్నారని, మీ మనసు మంచిదని, మీరు ఏపీ కోసం కొన్న కరెంటును తమకు ఇచ్చి ఆదుకోవాలని ఎర్రబెల్లి దయాకర రావు ఏపీ సీఎం చంద్రబాబుకు చెప్పారు.
ఎర్రబెల్లి
తన ప్రసంగంలో ఎర్రబెల్లి ఓ కథను వినిపించారు. 'ఈ మధ్య హరీష్ రావు, కేటీఆర్ కలిసి కేసీఆర్ వద్దకు వెళ్లారట. కేటీఆర్, కేసీఆర్తో మాట్లాడుతూ.. శ్రీశైలంలో మన విద్యుదుత్పత్తి నిలిపివేస్తే 300 మెగావాట్లు ఇస్తామని చంద్రబాబు అంటున్నాడు. మనం డిమాండ్ చేస్తే 1000 మెగావాట్లు ఇస్తారు. ఏం చెద్దామని ప్రశ్నించాడు. అప్పుడు కేసీఆర్.. మనం డిమాండ్ చేస్తే బాబు ఇస్తాడు. పంటలు బాగుంటాయి. అప్పుడు బాబు కరెంట్ ఇస్తే మనం గట్టెక్కామని రైతులు అనుకుంటారు. అదే పొలాలు ఎండిపోతే బాబుపై తప్పు నెట్టవచ్చు' అని హితోపదేశం చేశాడట అని ఎర్రబెల్లి కథ చెప్పారు.
మోత్కుపల్లి
తెలంగాణలో ప్రజలకు విప్లవ భావాలు ఎక్కువ అని, కేసీఆర్ తతంగం ఇక్కడ ఇంకా ఎన్నాళ్లో సాగదని, కేసీఆర్ను ఏవిధంగా గద్దె దింపాలా అని ఆలోచిస్తున్నారని, కేసీఆర్ సినిమా అయిపోయిందని, ఇప్పుడు ఎన్నికలు వస్తే తెరాసకు డిపాజిట్ కూడా దక్కదని మోత్కుపల్లి నర్సింహులు అన్నారు.
రావుల చంద్రశేఖర్ రెడ్డి
కేసీఆర్ రాష్ట్రానికి చిహ్నాలుగా ఇటీవలే పువ్వు, పక్షి, చెట్టు, జంతువును ప్రకటించారని, దాంతో పాటు ఒక తిట్టు, ఒక ఊతపదం కూడా ప్రకటిస్తే సరిపోయేదని, కేసీఆర్ ఎప్పుడువాడే 'సన్నాసి' అనే పదాన్ని తెలంగాణ తిట్టుగా, ఏది మాట్లాడినా ఆయన నోటి నుండి వచ్చే 'అద్భుతమైన' అనే పదాన్ని రాష్ట్ర ఊతపదంగా ప్రకటించాలని రావుల చంద్రశేఖర్ రెడ్డి సెటైర్ వేసి నవ్వించారు.