కెసిఆర్తోనే: బాబుమోహన్, వారితో జత: కావూరి
మెదక్/ ఏలూరు/ హైదరాబాద్: బంగారు తెలంగాణ తమ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుతోనే సాధ్యమని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేత బాబూమోహన్ అన్నారు. తెలంగాణకు సీఎంగా కెసిఆరే సమర్థుడని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అభిప్రాయపడ్డారు.
తొలినాళ్లలో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం సృష్టించిందని, ఇప్పుడు తెరాస ప్రభంజనం సృష్టించబోతుందని బాబూమోహన్ తెలిపారు. తెలంగాణలో క్లీన్స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. తనను ఓడించడానికి రాజనర్సింహ వంద కోట్ల రూపాయలు పంచారని, అయినా ఆందోల్ ప్రజలు తనవైపే ఉన్నారని బాబూమోహన్ అన్నారు.
ఇదిలావుంటే, కాంగ్రెస్ సిద్ధాంతాలు వదిలి వైయస్సార్ కాంగ్రెసు, తెరాసలతో జతకట్టిందని బిజెపి నేత కావూరి సాంబశివరావు ఆరోపించారు. రాష్ట్ర విభజన ప్రజల కోసం కాదు, రాజకీయాల కోసమే జరిగిందని ఆయన శనివారం మీడియా ప్రతిధులతో అన్నారు. కాంగ్రెస్కు బడుగు బలహీనవర్గాలు దూరమయ్యాయని కావూరి అభిప్రాయపడ్డారు.. ప్రభుత్వ పథకాలు ప్రచారానికే తప్ప ప్రజలకు చేరలేదన్నారు. ఉపాధి హామీలో భారీగా అవినీతి జరిగిందని కావూరి సాంబశివరావు విమర్శించారు.
కెసిఆర్, వైయస్ జగన్ అవినీతి అవిభక్త కవలలని తెలుగుదేశం నేత బాబు రాజేంద్రప్రసాద్ ధ్వజమెత్తారు. కెసిఆర్, జగన్లది కాంగ్రెస్ డీఎన్ఏనే అని, వారి ఇరువురూ రెండు రాష్ట్రాలను దోచుకోవాలని చూస్తున్నారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. కెసిఆర్ మాటలతో కాంగ్రెస్తో మ్యాచ్ ఫిక్సింగ్ తేలిపోయిందన్నారు.
ఈనెల 16 తర్వాత కెసిఆర్ చిలకజోస్యం చెప్పుకోవాల్సిందే అని ఆయన అన్నారు. జగన్ జైలుకు వెళ్తారు, చంద్రబాబు సచివాలయం వెళ్తారని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ విజయవంతంగా ఓడిపోయి హ్యాట్రిక్ కొడతారని ఆయన జోస్యం చెప్పారు. తెరాస పార్టీ ఓడిపోతుందనే ఆందోళనలోనే కెసిఆర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు.