వెంకయ్యకు హీరో శివాజీ పది ప్రశ్నలు: జగన్ తీరుపై ఆవేదన
హైదరాబాద్: ఆంధ్రుల తరపున కేంద్రమంత్రి వెంకయ్య నాయుడికి తెలుగు సినీ హీరో శివాజీ పదిప్రశ్నలు సంధించారు. ఎన్నికల ముందు పదేళ్లు ప్రత్యేకహోదా కల్పిస్తానని చెప్పి మాట మార్చడం వాగ్ధాన భంగం కాదా? అని హీరో శివాజీ వెంకయ్యను ప్రశ్నించారు. 14వ ఆర్థిక సంఘాన్ని సాకుగా చూపి ఏపికి అన్యాయం చేస్తున్న మాట వాస్తవం కాదా? అని ఆయన అడిగారు.
ప్రధాన మంత్రి తన విశేష అధికారాలను ఉపయోగించి రాష్ట్రాలకు ప్రత్యేకహోదా ఇవ్వవచ్చని ఆయన అన్నారు. మూడోసారి రాజ్యసభ సీటు కోసమే, వెంకయ్య ఏపీ ప్రయోజనాలను ఫణంగా పెట్టారని ఆయన ఆరోపించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత జగన్ ప్రత్యేకహోదాపై మాట్లాడకపోవడం అన్యాయమని శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రత్యేకహోదాపై అన్ని పార్టీలు పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా విషయాన్ని విస్మరిస్తున్న కేంద్ర మంత్రులకు తగిన బుద్ధి చెప్తామని ఆయన హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు, కేంద్ర మంత్రి సుజనా చౌదరిపై కూడా ఆయన విరుచుకుపడ్డారు. ఎపికి పది వేల కోట్ల రూపాయలు ఇచ్చారని సుజనా చౌదరి ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన అన్నారు. బ్యాంక్ బకాయిలను మాఫీ చేయించుకునేందుకు సుజనా చౌదరి మంత్రి పదవిని వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
ఈ గడ్డపై అభిమానంతోనే తాను దీక్ష చేపట్టినట్లు ఆయన తెలిపారు. ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పడం లేదా అని ఆయన వెంకయ్యను అడిగారు. ప్రత్యేక హోదా కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పడం అబద్ధం కాదా అని కూడా అడిగారు. తన దీక్షకు మద్దతు తెలిపిన కాంగ్రెసు, వైసిపి, బిజెపి, టిడిపి నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications