పోలీసుల అదుపులో గజదొంగ ప్రకాష్ సాహూ
విజయవాడ: కనకదుర్గ ఆలయంలో బంగారు కిరీటం, నగలు దోచుకున్న గజదొంగ ప్రకాష్ సాహూ(34)ను విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణలంకలోని ఓ లాడ్జిలో సాహూ మకాం వేశాడన్న పక్కా సమాచారంతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసి, రహస్యంగా విచారిస్తున్నట్లు తెలిసింది.
మార్చి 25న సాహు విజయవాడలోని ప్రసాదంపాడు సాయిబాబా ఆలయంలో 40 కిలోల వెండి సామాగ్రిని దోచుకున్నాడు. సీసీ కెమెరా చిత్రాలు, క్లూస్టీమ్ ఆధారంగా అది సాహూ పనిగా పోలీసులు నిర్ధారించారు. మధ్యప్రదేశ్ బిలాయికి చెందిన సాహూ ఎలక్ర్టిషన్గా పనిచేశాడు. అతని తండ్రి ఆలయంలో పూజారి. తొలిసారి అదే ఆలయంలో చోరీ చేశాడు సాహు.
1997 ఒడిశాలోని కటక్లో రెండు ఇళ్లను దోచాడు. 1998 ఏప్రిల్ 25న బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో బంగారు ఆభరణాలను దోచుకున్నాడు. గ్యాస్ కట్టర్లు, స్క్రూడ్రైవర్లు వినియోగించి తాళాలను బద్దలు కొట్టి దొంగతనాలకు పాల్పడేవాడు.
ఇప్పటి వరకు రూ. కోట్ల విలువైన ఆభరణాలు, నగదును ఆలయాల నుంచి దొంగిలించినట్లు పోలీసులు రికార్డులు చెబుతున్నాయి. దోచుకున్న సొమ్ముతో జల్సాలు చేయడం, మళ్లీ చోరీలు చేయడం ఇతనికి అలవాటుగా మారింది.
విజయవాడ కృష్ణలంకలోని ఒక లాడ్జీలో మకాం వేసిన సాహు గురించి సమాచారం అందుకున్న పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఏపి తెలంగాణ రాష్ర్టాలతో పాటు మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, కర్నాటకలోని పలు ఆలయాల్లో సాహూ భారీ దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి.