బూర్గంపాడు బ్రిడ్జిపై నుంచి వాగులో పడిన టెంపో వాహనం.. నలుగురు మృతి
భద్రాద్రికొత్తగూడెం: జిల్లాలోని బూర్గంపాడు వద్ద బుధవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అదుపుతప్పిన టెంపో వాహనం బ్రిడ్జిపై నుంచి వాగులో పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా నలుగురు మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. గాయపడినవారిని బూర్గంపాడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
బాధితులంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లాలోని టీ.నర్సాపురం మండలం తిరుమలదేవిపేట వాసులుగా గుర్తించారు. భద్రాచలం శ్రీరామచంద్రస్వామివారి ఆలయానికి వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో టెంపోలో 12 మంది ఉన్నట్లు తెలిసింది.

వీరిలో నలుగురు మరణించగా.. నలుగురు చిన్నారులు, నలుగురు పెద్దవారికి గాయాలు కావడంతో వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులను సందీప్ (10), ప్రదీప్ (10), శ్రీనివాసరావు(40), దుర్గారావు(43)గా పోలీసులు గుర్తించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నలుగురు మృతి చెందడంతో వారి కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
స్నానానికి వెళ్లి ఇద్దరు పిల్లలు మృతి
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కొండపాకలో విషాద ఘటన చోటు చేసుకుంది. చెక్ డ్యాంలో స్నానానికి వెళ్లిన ఇద్దరు పిల్లలు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయారు. కొండపాకలో శివారు పెద్దపల్లి జిల్లా పొత్కపల్లి పరిధిలోని చెక్ డ్యాంలో స్నానం చేసేందుకు బాలిక నిత్య(12), బాలుడు కన్ని(13) మిగితా కొంతమంది పిల్లలతో కలిసి వెళ్లారు. స్నానం చేస్తుండగా నీళ్లల్లో మునిగిపోయి నిత్య, కన్ని మృతి చెందారు. మరో ముగ్గురు చిన్నారులను స్థానికులు గమనించి కాపాడారు. ఇద్దరు పిల్లల మృతితో వారి కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.












Click it and Unblock the Notifications