పునర్విభజన ఫైలు కదిలిందోచ్...ఎన్నికల కమీషన్ కు పంపిన కేంద్ర హోంశాఖ..
అమరావతి: ఎట్టకేలకు...తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన ఫైలు ముందుకు కదిలింది. సీట్ల పెంపుకు సంబంధించిన ఈ దస్త్రం మరో అడుగు ముందుకెళ్లింది. ఈ ఫైలును తాజాగా కేంద్ర హోం శాఖ మరి కొంత సమాచారం కోరుతూ ఎన్నికల కమిషన్కు పంపినట్లు తెలిసింది.
ఈసీ నుంచి సమాచారం కోరుతూ కేంద్ర హోం శాఖ పంపిన పునర్విభజన ఫైలులో...నియోజకవర్గాల పునర్విభజన చేపడితే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల అమలు ఎలా ఉండాలనే విషయమై ఈసీ తన అభిప్రాయం చెప్పాలని అందులో కోరినట్లుగా తెలుస్తోంది. ఈ రిజర్వేషన్లకు 2001 జనభా లెక్కంపును ప్రాతిపదికగా తీసుకోవాలా? లేక 2011 జనాభా గణననా అనే విషయమై కొంత వివాదం చోటుచేసుకున్నసంగతి తెలిసిందే.

అప్పుడు అలా...ఇప్పుడు ఎలా?
2001 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుని 2008లో నియోజకవర్గాలను పునర్వ్యవస్థీకరించడం గమనార్హం. అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం తమ రాష్ట్రాల్లో ఎస్సీ రిజర్వేషన్ సీట్లు పెంచాలని కోరుతూ మూడు రాష్ట్రాలు సుప్రీంకోర్టుకు వెళ్లాయి. ఆ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది.

సుప్రీం కోర్టు...ఏం చెప్పిందంటే...
నియోజకవర్గాల పునర్విభజన విషయమై సుప్రీం కోర్టును ఆశ్రయించిన వారికి...2008 పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం 2026 వరకూ నియోజకవర్గాల్లో ఎటువంటి మార్పుచేర్పులకు అవకాశం లేదని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. కానీ తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి పరిస్థితి మారింది. ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్నిసుప్రీం కోర్టు తీర్పు తరువాత పార్లమెంటు ఆ తర్వాత ఆమోదించింది.

ఇప్పుడున్న సమస్యలు...ఏమిటంటే...
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి కేంద్ర హోంశాఖ కు రెండు అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ పునర్విభజన చేసేందుకు 2008 నాటి చట్టంలోని నిబంధనలే వర్తిస్తాయా లేక 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవాలా అనేది ఒక అంశం..ఈ విషయమై క్లారిటీ కోసమే కేంద్ర హోంశాఖ ఎన్నికల కమీషన్ అభిప్రాయం కోరింది. అలాగే రెండో అంశం విషయానికి వస్తే గతంలో నియోజకవర్గాలను పునర్విభజించినప్పుడు ఎస్సీ నియోజకవర్గాలను రాష్ట్రమంతా విస్తరింపజేశారు. వారి జనాభా ఎక్కువ ఉన్నచోట మాత్రమే ఇస్తే రిజర్వుడు నియోజకవర్గాలన్నీ ఒకేచోట వస్తున్నాయని, అది కరెక్ట్ కాదనే ఉద్దేశ్యంతో అలా చేశారు. అయితే ఈసారి పునర్విభజనకు ఏం చెయ్యాలనేది మరో సమస్య. అప్పటి చట్టం అందుకు అనుమతించింది. ఇప్పుడు కూడా దానినే పరిగణనలోకి తీసుకోవాలా అన్నది మీమాంస. దీనిపైన ఈసీ తన అభిప్రాయాన్ని తెలపాల్సి ఉంది.

ఎప్పటికి పూర్తయేను...రాజకీయమే కీలకం...
కేంద్ర హోం శాఖ స్పష్టత కోరిన అంశాలపై అభిప్రాయాల వెల్లడికి ఎన్నికల కమిషన్ ఎక్కువ సమయం తీసుకోదని, రోజుల వ్యవధిలోనే రిప్లయి వస్తుందని హోంశాఖ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఆ తర్వాత మరో నాలుగు శాఖలకు కూడా హోం శాఖ ఇటువంటి లేఖలే రాయాల్సి ఉంది. వాటికి కూడా సమాధానాలు రాబట్టాక అన్నిటినీ కలిపి తుది ప్రతిపాదనలు సిద్ధం చేస్తారు. అనంతరం వాటిని పీఎంవో ఆమోదించాక దీనిని కేబినెట్ ముందు పెడతారు. ఆ తర్వాత కేబినెట్ ఆమోదంతో అది పార్లమెంటు ముందుకు వెళ్తుంది. ఫైనల్ గా రాజకీయ నిర్ణయమే కీలకమని అందరికీ తెలిసిన విషయమే. అక్కడ కూడా ఆమోదం పొందితే ఆ తరువాత రెండు రాష్ట్రాల్లో నియోజకవర్గాలు పెరుగుతాయి.












Click it and Unblock the Notifications