జగన్ ఇచ్చే హామీలు నెరవేర్చాలంటే...దేశ బడ్జెట్ సరిపోదు: టీడీపీ ఎంపీ మురళీమోహన్
తూర్పుగోదావరి:సీఎం కుర్చీ ఎక్కాలన్న తాపత్రయంతో ప్రతిపక్ష నేత జగన్ చేస్తున్న వాగ్దానాలు నెరవేరాలంటే దేశ బడ్జెట్ చాలదని రాజమహేంద్రవరం టిడిపి ఎంపీ మాగంటి మురళీమోహన్ వ్యాఖ్యానించారు.
వైఎస్ జగన్ ఇస్తున్న హామీలు, గాలి మాటలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని మురళీమోహన్ తేల్చిచెప్పారు. గురువారం రాజమహేంద్రవరం 49వ డివిజన్లో టీడీపీ ఆధ్వర్యంలో 'నగరదర్శిని-నగర వికాసం' కార్యక్రమానికి ఎంపి మురళీ మోహన్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు మళ్లీ అధికారం చేపడితేనే భావితరాలకు భవిష్యత్తు ఉంటుందని మురళీ మోహన్ స్పష్టం చేశారు.
రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలూ కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు మద్దతు తెలపాలని రాజమహేంద్రవరం ఎంపి మురళీమోహన్ ప్రజలను కోరారు. గత ఎన్నికల్లో టీడీపీతో జతకట్టిన బీజేపీ అధికారంలోకి రాగానే పునర్విభజన చట్టంలోని అంశాలను నెరవేర్చకపోగా నమ్మించి మోసం చేసిందని దుయ్యబట్టారు. మరోపక్క అధికారంలోకి రావడానికి ఆరాటపడుతున్న జగన్ పచ్చి అబద్దాలు,మాయమాటలు చెబుతున్నారని...వాటిని నమ్మవద్దని కోరారు.

తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని రూ.లక్ష కోట్లు దోచుకున్న జగన్కు అధికారం అప్పగిస్తే ఇంకెన్ని కోట్లు దోచుకుంటాడోనని మురళీ మోహన్ ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం గుడా చైర్మన్ గన్ని కృష్ణ మాట్లాడుతూ ప్రజల మోహాల్లో చిరునవ్వులు చూసేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం కష్టపడుతున్నారని ప్రస్తుతించారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించడానికే టిడిపి ప్రభుత్వం 'నగరదర్శిని' కార్యక్రమం చేపట్టిందన్నారు.
ఇదే కార్యక్రమంలో పాల్గొన్న నగర మేయర్ పంతం రజనీశేషసాయి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ డివిజన్ ఇన్చార్జి ఆశపు సత్యనారాయణ, నగర అధ్యక్షుడు, డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, ప్రధాన కార్యదర్శి రెడ్డి మణేశ్వరరావు, కార్పొరేటర్ కడలి రామకృష్ణ, ఆదిరెడ్డి వాసు తదిదరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications