స్మశానంలో పాతిపెట్టిన మహిళ మృతదేహం మాయం.. అసలేం జరిగిందంటే!!
గత ఏడాది మృతి చెందిన ఒక మహిళ కు సంబంధించి ఇటీవల నమోదైన కేసులో, మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం చేయడం కోసం స్మశానంలో పాతిపెట్టిన శవాన్ని బయటకు తీయడానికి ప్రయత్నించిన రెవెన్యూ, పోలీసు అధికారులు షాకయ్యారు. పాతి పెట్టిన చోట మృతురాలికి సంబంధించిన అస్తిపంజరం దొరకకపోవడంతో పోలీసులు అన్వేషణను ముమ్మరం చేశారు.
తూట్రాళ్లపల్లి కి చెందిన భార్యాభర్తల మధ్య గొడవ
ఇంతకీ ఏం జరిగిందంటే అనంతపురం జిల్లా యాడికి మండలం తూట్రాళ్ల పల్లి కి చెందిన లింగాల మల్లన్న, ఓబులమ్మ దంపతుల కుమారుడు గుర్రప్పకు యల్లనూరు మండలం తిమ్మంపల్లి కి చెందిన సుంకులమ్మ రెండవ కుమార్తె అయిన గంగాదేవి తో 2009లో వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె ,కుమారుడు ఉన్నారు. లారీ డ్రైవర్ గా పని చేస్తున్న గుర్రప్ప కుటుంబంతో కలిసి తాడిపత్రిలో నివసించేవాడు . అయితే గత ఏడాది డిసెంబర్ 15వ తేదీన ఉదయం భార్యాభర్తలిద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. భార్యతో గొడవ పడిన గుర్రప్ప ఆపై తన డ్యూటీ కి వెళ్ళిపోయాడు.
పురుగులమందు తాగి భార్య ఆత్మహత్య..
అదే రోజు సాయంత్రం గుర్రప్పకు ఫోన్ చేసిన గంగాదేవి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, పురుగుల మందు తాగాను అని పేర్కొంది. దీంతో ఇంటికి వచ్చిన గుర్రప్ప బంధువుల సహాయంతో భార్యను తాడిపత్రి లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్ళి చికిత్స చేయించే ప్రయత్నం చేశాడు. ఇక తాడిపత్రిలో వైద్యులు పెద్ద ఆసుపత్రికి తీసుకు వెళ్ళమని సలహా ఇవ్వగా అదే రోజు రాత్రి అనంతపురానికి ఆమెను తరలించే ప్రయత్నం చేశాడు. ఇక మార్గమధ్యంలో గంగాదేవి మృతి చెందింది.
మృతదేహం ఖననం .. ఇప్పుడు అనుమానాస్పద మృతిగా కేసు
దీంతో గంగాదేవి మృతదేహాన్ని తూట్రాళ్ళపల్లికి తీసుకువెళ్లి ఇరువైపుల కుటుంబ సభ్యులు సమస్యలు ఖననం చేశారు. ఇదిలా ఉంటే గత 5 నెలల క్రితం మరో మహిళను గుర్రప్ప వివాహం చేసుకున్నారు. దీంతో సుంకులమ్మ తన కుమార్తె గంగాదేవికి ఇచ్చిన కానుక విషయంలో గుర్రప్ప తో గొడవ పడింది. అంతేకాదు తన కుమార్తె మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ రెవిన్యూ, పోలీసు అధికారులను ఆమె ఆశ్రయించింది. తన కుమార్తె మృతి కేసును అనుమానాస్పద మృతిగా దర్యాప్తు చేయాలని ఆమె పోలీసులను విజ్ఞప్తి చేసింది.
ఖననం చేసిన చోట లభించని మృతదేహం .. పోలీసుల అన్వేషణ
దీంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు తూట్రాళ్ళపల్లి స్మశానానికి చేరుకొని గంగాదేవిని పాతి పెట్టిన చోట తవ్వి చూశారు. మృతదేహం కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్వేషించారు. అయినప్పటికీ ఆచూకీ లభ్యం కాకపోవడంతో మృతదేహం మాయమైన ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.