పని చేయలేకపోతే సర్దుకొని వెళ్లిపోండి... అధికారులపై హైకోర్టు ఆగ్రహం
నెల్లూరు:నెల్లూరు జిల్లాలో రెవిన్యూ శాఖ అధికారులపై హై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పదేళ్లుగా కోర్టు ఉత్తర్వులు అమలు చేయకుండా ఉపేక్షించడంపై హై కోర్టు మండిపడింది.
అధికారులకు విధులు నిర్వర్తించడం చేతకాకుంటే సర్దుకొని వెళ్లిపోవాలని...ఎంతోమంది యువకులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని హై కోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. కోర్టు ఉత్తర్వులను అధికారులు పాటించకపోవడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటని హై కోర్టు దర్మాసనం అవేదన వ్యక్తం చేసింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను సెప్టెంబరు 11కి వాయిదా వేసింది. వివరాల్లోకి వెళితే...

కేసు...వివరాలు ఇవి...
యూరియా, ఫాస్పేట్ ఎరువుల ప్లాంట్ నెలకొల్పనున్నట్లు ప్రకటించడంతో ఇప్కో సంస్థకు 1997లో నెల్లూరు జిల్లా కొడవలూరు మండల పరిధిలోని తలమంచి, రాచర్లపాడు, రేగడి చెలిక, బొడ్డువారిపాల్లె తదితర గ్రామాల్లోని స్థానిక రైతులు, ప్రభుత్వ, శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానానికి చెందిన 2,776 ఎకరాలను కేటాయించారు. అయితే ఆ సంస్థ ప్లాంట్ స్థాపించకుండా ఈ భూములను ఎకరా రూ.56 లక్షల చొప్పున కోకో కోలా సంస్థకు విక్రయించి సొమ్ము చేసుకొంటోందని రైతులకు తెలిసింది. దీంతో వారు కోర్టును ఆశ్రయించి భూసేకరణ నోటిఫికేషన్ లేకుండా ఆ భూములు సేకరించారని తెలిపారు. ఆ క్రమంలో చట్ట ప్రకారం ఆ భూములు ఎవరికి చెందుతాయో తేల్చాలని 2008 లో కోర్టు ఆదేశించింది.

పదేళ్లయినా...అమలుకు నోచుకోలేదు
అయితే పదేళ్లవుతున్నా కోర్టు తీర్పు అమలుకు నోచుకోకపోవడంతో ఎంపీటీసీ శ్రీధర్రెడ్డి మరికొందరు ఈ ఆరోపణలతో హైకోర్టులో పిటిషన్ వేశారు. వారి తరఫున సీనియర్ న్యాయవాది ఎస్. రామచంద్రరావు వాదించారు. ఆలయ భూములపై తలెత్తిన వివాదంలో 2008 లో సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన ఆదేశాలను ఇప్పటి వరకూ అమలు చేయలేదని చెప్పారు. ఈ వాదనలు విన్న ధర్మాసనం... కోర్టు ఆదేశాలిచ్చి దశాబ్దం గడుస్తున్నా ఎందకు అమలు చేయలేదని రెవిన్యూ అధికారులను నిలదీసింది. అధికారుల చర్యలు న్యాయవ్యవస్థను, రాజ్యాంగాన్ని అవహేళన చేసేవిగా ఉన్నాయని వ్యాఖ్యానించింది.

రెవిన్యూ అధికారులపై...హై కోర్టు మండిపాటు
పదేళ్లయినా కోర్టు ఉత్తర్వులు అమలు చేయకపోవడంపై నెల్లూరు జిల్లా రెవిన్యూ శాఖ అధికారులను ఉద్దేశించి హైకోర్టు ఏమన్నదంటే..."కోర్టు ఉత్తర్వులు జారీ చేసి 10ఏళ్లు అయ్యింది...అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు...ఉదాసీనంగా ఉంటే ఉపేక్షించబోం...భూములు కబ్జాకు గురవుతుంటే అధికారులు సహకరిస్తున్నట్లు ఉంది... ప్రజాధనం నుంచే అధికారులకు, జడ్జిలకు జీతభత్యాలు చెల్లిస్తున్నారనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి...విధులు నిర్వర్తించలేని అధికారులు సర్దుకొని ఇంటికెళ్లాలి...ఎందరో యువకులు ఉద్యోగాలకోసం ఎదురు చూస్తున్నారు"...అని ఘాటుగా విమర్శించింది.

ప్రజాస్వామ్యనికి...సిగ్గుచేటు
కోర్టు ఉత్తర్వులు పాటించకపోవడం ప్రజాస్వామ్య విధానానికే సిగ్గుచేటని హై కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది...కండ బలానికి, ధనబలానికి లొంగి అధికారులు నిర్ణయం తీసుకోలేదా..? అని హైకోర్టు అధికారులను నిలదీసింది. అసలు శ్రీ కోదండరామస్వామి ఆలయ భూములకు సంబంధించిన రికార్డులు ఎక్కడున్నాయి?...దశాబ్దం క్రితం ఇచ్చిన ఆదేశాలు ఇంతవరకు ఎందుకు అమలు చేయలేదు?...ఈ కేసుకు సంబంధించిన అధికారి ఎవరు?...తదితర వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని కావలి ఆర్డీవోను ఆదేశిస్తూ తదుపరి విచారణను సెప్టెంబరు 11కి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్, జస్టిస్ వి.రామసుబ్రమణ్యన్తో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ ఆదేశాలు జారీచేసింది.












Click it and Unblock the Notifications