చోరీ: కాసేపట్లో పెళ్లనగా రూ. 16లక్షల విలువైన వధువు నగలు మాయం
అనంతపురం: జిల్లాలోని హిందూపురంలోని ఓ పెళ్లి మండపంలో దొంగతనం జరిగింది. కాసేపట్లో పెళ్లి అనగా వధువు నగలను దొంగలు అపహరించుకుపోయారు. రూ. 16 లక్షల విలువైన 60 తులాల బంగారం కనిపించకుండా పోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
దీంతో కంచి కామాక్షి కళ్యాణ మండపంలో చోటు చేసుకున్న ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పెళ్లికూతుర్ని చేసిన తర్వాత గురువారం రాత్రి కళ్యాణ మండపంలో పెళ్లి బృందం నిద్రపోయారు.
కాగా, శుక్రవారం ఉదయం లేచి నగల కోసం వెదకగా, అవి కనిపించలేదు. అయితే తెలిసినవారే ఈ దొంగతనానికి పాల్పడ్డారా? లేక బయటి నుంచి వచ్చిన దుండగులెవరైనా చోరీ చేశారా? అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇది ఇలా ఉండగా, నగలు లేకపోయినా పెళ్లికి ఇరువర్గాల వారు అంగీకరించడంతో.. పెళ్లి ఘనంగా జరిగింది. దీంతో వధువు తరపువారు ఊపిరి పీల్చుకున్నారు.
కారు బోల్తా: ఒకరు మృతి
శ్రీకాకుళం జిల్లాలోని కొత్తరోడ్డు జంక్షన్లో కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అతివేగం వల్లనే కారు బోల్తా పడిందని పోలీసులు చెప్పారు. పూర్తి వివరాలు తెలియరాలేదు.