విశాఖ భూకుంభకోణంలో మరో బాంబు: ఇంకో కుంభకోణాన్ని బయటపెడుతానన్న విష్ణుకుమార్!
తాము కొనుగోలు చేసిన భూమి ఐదేళ్ల తర్వాత ఉంటుందో మాయమవుతుందో అన్న దుస్థితి ఉంటే.. ఇక విశాఖలో వ్యాపార అనుకూల వాతావరణం ఎలా సాధ్యమవుతుందో చెప్పాలని విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు.
అమరావతి: విశాఖ భూకుంభకోణాలపై ఇప్పటికే ఉన్న ఆరోపణలతో సతమతమవుతున్న టీడీపీ ప్రభుత్వానికి బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మరో షాక్ ఇచ్చారు. విశాఖలో జరిగిన మరో భూ కుంభకోణాన్ని 15రోజుల్లో బయటపెడుతానని సంచలన వ్యాఖ్యలు చేశారు.
మనుషులా? పశువులా?: భూదందాపై కడిగేసిన అయ్యన్న!, కంగు తిన్న మంత్రులు..
భూకుంభకోణాల్లో ప్రజాప్రతినిధులే నేరుగా జోక్యం చేసుకున్న ఉదంతాలున్నాయని విష్ణుకుమార్ ఆరోపించారు. ప్రస్తుతం భూకుంభకోణానికి సంబంధించి అన్ని వివరాలను సేకరించే పనిలో ఉన్నానని, త్వరలోనే వాటిని బయటపెడుతానని అన్నారు. విశాఖలో ఇప్పటికే వెలుగులోకి వచ్చిన భూకుంభకోణాలపై ప్రభుత్వం వేసిన సిట్ విచారణతో న్యాయం జరుగుతుందన్న విశ్వాసం ప్రజల్లో లేదన్నారు.
విశాఖ భూకుంభకోణాలపై ఆరు నెలల క్రితం తాను శాసనసభలో ప్రస్తావించినప్పుడే విచారణ చేయిస్తే పరిస్థితి ఇంతదాకా వచ్చి ఉండేది కాదన్నారు. అసెంబ్లీ సాక్షిగా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని అప్పట్లో తాను డిమాండ్ చేశానని గుర్తుచేశారు. అసెంబ్లీలో జగన్ ఛాంబర్ లీకేజీపై సీఐడీ విచారణకు ఆదేశించినంత వేగంగా విశాఖ భూకుంభకోణాలపై స్పందించి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదన్నారు.
తొలుత బహిరంగ విచారణ అని ప్రకటించి ఆ తర్వాత సిట్ తో విచారణ చేయించడాన్ని ఆయన తప్పుపట్టారు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక దర్యాప్తు బృందంలో రిటైర్డ్ జడ్జిని సభ్యుడిగా నియమించాలని డిమాండ్ చేశారు. బహిరంగ విచారణ జరిపితే భూములు ఎన్ని రకాలుగా కబ్జా పాలవుతున్నాయో తెలిసే అవకాశముండేదన్నారు.
తాము కొనుగోలు చేసిన భూమి ఐదేళ్ల తర్వాత ఉంటుందో మాయమవుతుందో అన్న దుస్థితి ఉంటే.. ఇక విశాఖలో వ్యాపార అనుకూల వాతావరణం ఎలా సాధ్యమవుతుందో చెప్పాలని విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు. ఈ కుంభకోణం ఇప్పటికే కేంద్రం దృష్టిలో ఉందని చెప్పారు. భూకుంభకోణంపై తాను పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వెళ్తే.. అది సివిల్ వివాదం కాబట్టి జోక్యం చేసుకోలేదని చెప్పారు.