ముందే హైదరాబాద్ ను వదిలేయడం వల్లేనా...చంద్రబాబుకు ఈ వరుస అవమానాలు...
అమరావతి: అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ కు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రస్తుత ఎపి సిఎం నారా చంద్రబాబునాయుడుకు ఇటీవల వరుస అవమానాలు ఎదురవుతున్నాయి. మిగతా సందర్భాల విషయం అటుంచితే పొరుగు రాష్ట్రం తెలంగాణా ప్రభుత్వం నుంచి ఎదుర్కొంటున్న అవమానాలు ఆయనను తప్పకుండా కలవరపెట్టుంటాయి...ఈ పరిస్థితికి కారణం ఏంటి?
Recommended Video


ఇటీవలే...అంతలోనే...
ఇటీవలే తెలంగాణా ఐటి మంత్రి కెటిఆర్ హైటెక్ సిటీని నిర్మించింది చంద్రబాబే అని అసలు హైదరాబాద్ కు ఐటి హంగులు సమకూరడం కేవలం చంద్రబాబు వల్లనేనని తేల్చి చెప్పేశారు. దీంతో టిడిపి శ్రేణుల్లో హర్షం వ్యక్తం అయింది. అయితే అంతలోనే చంద్రబాబుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవమానం ఎదురవడం ఆ ఆనందాన్ని మరుగున పర్చి పాత గాయాన్ని కెలికినట్లయింది. అంతేకాదు తెలంగాణా ప్రభుత్వం అవకాశం లభించినపుడల్లా చంద్రబాబును అవమానిస్తూనే ఉందన్న వాదనలకు బలం చేకూర్చింది.

ఈ మధ్యనే ఇవాంకా టూర్ కు...
అమెరికా అధ్యక్షుని కుమార్తె ఇవాంకా హైదరాబాద్ పర్యటనకు ప్రపంచవాప్యంగా ప్రాముఖ్యత లభించగా ఇంతటి ముఖ్యమైన ఘట్టానికి ఎపి సిఎం చంద్రబాబును ఆహ్వానించకపోవడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. పైగా చట్ట ప్రకారం కూడా ఆంధ్రప్రదేశ్కు ఇంకా హైదరాబాద్ లో పై భాగస్వామ్యం, అధికారం ఉన్నాయి. అయినప్పటికీ ఇవాంకా పర్యటనకు చంద్రబాబుకు ఆహ్వానం అందలేదు.

ప్రపంచ తెలుగు మహా సభలకు కూడా...
ఇదే రీతిలో ప్రపంచ తెలుగు మహాసభలు తెలంగాణ రాష్ర్టంలో మొదటిసారిగా హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు.ఉప రాష్ట్రపతి
వెంకయ్యనాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నఈ తెలుగు మహా సభలకు ప్రపంచం నలుమూలలా
ఉన్న ప్రముఖులను ఆహ్వానించారు. కానీ....అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ ను పరిపాలించిన సిఎం, కెటిఆర్ చెప్పినట్లు హైదరాబాద్ లో ఐటిని అభివృద్దిచేసిన నాయకుడు, అన్నింటికి మించి తోటి తెలుగు రాష్ట్రం తెలుగు ముఖ్యమంత్రి...ఇన్ని ప్రాధాన్యతలు ఉన్న చంద్రబాబును మాత్రం ఈ ప్రపంచ తెలుగు మహా సభలకు ఆహ్వానించలేదు.

ఎన్టీఆర్ ఫోటో వివాదం...
ఈ ప్రపంచ తెలుగు మహా సభల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ లో ఒకనాటి అగ్ర కథానాయకుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు ఫొటో పెట్టలేదని ఆందోళన వ్యక్తం అయింది. అంతేకాదు
ఈ తెలుగు మహాసభలను విమర్శించిన వారిని సైతం తెలంగాణా ప్రభుత్వం అరెస్టులు చేసింది.

పార్టీలో ప్రకంపనలు...
ఈ వివాదాలు ఎలా ఉన్నా ఈ సభలకు చంద్రబాబు నాయుడుని ఆహ్వానించకపోవడంపై మరోసారి పెద్ద చర్చే జరుగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కావాలనే ఇలా చంద్రబాబును దూరంగా పెడుతున్నారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు టిడిపి లో కూడా ఈ అంశం ప్రకంపనాలు రేపుతోంది. తెలంగాణా ప్రభుత్వం చంద్రబాబు పట్ల వ్యవహరిస్తున్న తీరుపై తెలుగుదేశంపార్టీ శ్రేణులు అంతర్గతంగా రగిలిపోతున్నాయి.

కారణం అదేనా...
విభజన చట్టంలో భాగంగా పదేళ్లపాటు హైదరాబాద్లోనే ఉండే అధికారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉంది. కానీ వివిధ కారణాల దృష్ట్యా చంద్రబాబు యుద్దప్రాతిపదికన మకాంను హైదరాబాద్ నుంచి విజయవాడకు మార్చేశారు. ఆయన రావడమే కాకుండా ప్రధాన కార్యాలయాలు, ఉద్యోగులను సైతం హుటాహుటిన విజయవాడకు రప్పించారు. దీంతో చేజేతులా హైదరాబాద్ను వదిలేసుకున్నట్లయింది. అంతేకాకుండా హైదరాబాద్తో అనుబంధం లేకుండా మనమే చేసుకున్నట్లయింది. చట్టప్రకారం హైదరాబాద్లో మరో ఆరేళ్లు ఉండే అవకాశం ఉన్నప్పటికీ చేతులారా దాన్ని వదులేసుకుకున్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఇప్పుడు ఆ చర్చ మరోమారు తెరమీదకు వచ్చింది.

అందరికి నష్టం...
హైదరాబాద్ ను ముందే వదిలేయడం ద్వారా చంద్రబాబు తెలంగాణాలో టిడిపి మనుగడ దెబ్బతినే పరిస్థితులు కొనితెచ్చుకున్నారనే వాదనలు ఆ పార్టీలోనే విన్పిస్తున్నాయి. ఓటుకు నోటు కేసు వల్లే హైదరాబాద్ను వదులుకున్నారని, ఈ కేసులో ప్రధాన పాత్ర పోషించిన రేవంత్రెడ్డి ఇపుడు పార్టీ కూడా మారిపోయారని కానీ ఈ పరిమాణంతో చంద్రబాబు, టిడిపితో పాటు ఎపి ప్రజలకు కూడా నష్టం జరిగిందనే వాదన వినిపిస్తోంది.

టిడిపి కి ఇంకా నష్టం...
వాస్తవంగా చూస్తే ఇప్పుడు తెలంగాణాలో తెలుగుదేశం పార్టీది నామమాత్రపు పాత్రేనని విశ్లేషించక తప్పదు. టిడిపి ని జాతీయ పార్టీగా ప్రకటించినా, పక్క రాష్ర్టంలోనే ఉనికి కనుమరుగయ్యే పోయే పరిస్థితుల్ని తెలుగుదేశం పార్టీ చేజేతులా కొనితెచ్చుకున్నట్లు కనిపిస్తోంది.
దీనికి పూర్తి బాధ్యత చంద్రబాబు నాయుడే వహించాల్సి ఉంటుందనడంలో సందేహం లేదు. మరి కొన్నేళ్లు హైదరాబాద్లోనే ఉంటూ పాలన కొనసాగించి ఉంటే, కార్యాలయాలను నిర్వహిస్తూ ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని రాజకీయ పరిశీలకుల విశ్లేషణ.

అలా జరిగి ఉంటే...
హైదరాబాద్ లో మరి కొంత కాలం ఉండి ఉంటే...తెలంగాణ ప్రభుత్వం కూడా ఎపి ప్రభుత్వంతో మైత్రీ బంధం కొనసాగించాల్సిన పరిస్థితి అనివార్యంగా ఉండేది. కానీ చంద్రబాబు మరోలా ఆలోచించడం వల్లే ఇప్పుడు ఈ పరిస్థితులు ఉత్పన్నమయ్యాయని అంటున్నారు. ఈ పరిస్థితికి చంద్రబాబే కారణమని, వరుస అవమానాల రూపంలో అందుకు తగిన మూల్యం చెల్లించుకుంటున్నారని విమర్శలు జోరందుకున్నాయి.












Click it and Unblock the Notifications