మరో ఎంపిని బాబు వదులుకున్నట్లేనా : సునీల్ కు కాకినాడ సీటు : త్రిమూర్తులు ఎటు..!
టిడిపి నుండి ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు వైసిపి లో చేరారు. లోక్సభ లో టిడిపి ఫ్లోర్ లీడర్ గా ఉన్న తోట నర్సింహం తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని తేల్చేసారు. జగ్గంపేట సీటు కావాలని కోరారు. కానీ, చంద్రబాబు మాత్రం తోట అభ్యర్ధనను పరిగణలోకి తీసుకోలేదు. ఇదే సమయంలో చలమలశెట్టి సునీల్ టిడిపి లో చేరారు. ఇక, తోట త్రిమూర్తుల పరిస్థితి ఏంటి. ఆయన టిడిపి లో కొనసాగుతున్నారా..బయటకు వస్తున్నట్లా..
టిడిపి వీడటానికి నర్సింహం సిద్దం..
కాకినాడ ఎంపీ తోట నర్సింహం టిడిపి ని వీడుతున్నట్లు సమాచారం. ఆయన కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్ర బాబును కలిసి తన సతీమణికి జగ్గంపేట సీటు ఇవ్వాలని అభ్యర్దించారు. తాను అనారోగ్యం కారణంగా లోక్సభకు పోటీ చేయటం లేదని తేల్చారు. అయితే, పరిశీలిస్తానని హామీ ఇచ్చిన సీయం.. ఇప్పుడు జగ్గంపేట సీటును వైసిపి నుండి ఫిరాయించి టిడిపిలో చేరిన జ్యోతుల నెహ్రూకు కేటాయించారు. దీంతో..ఆయన తోట నర్సింహం కు జగ్గంపేట సీటు ఇవ్వలేమని తెలిసే ఆ డిమాండ్ తెర మీదకు తెచ్చారని టిడిపి అధినేత భావిస్తున్నారు. తోట నర్సింహం కుటుంబం వైసిపి లో చేరాలని నిర్ణయించారనేది టిడిపి అంచనా. దీంతో..పిఠాపురం నుండి వర్మ తో పాటుగా నర్సింహం సతీమ ణి పేరును పరిశీలిస్తున్నామనంటూ లీకులు ఇచ్చారు. దీంతో..కొద్ది రోజుల క్రితం వైసిపి నేత బొత్సాతో సమావేశమైన తోట నర్సింహం ఇప్పుడు టిడిపి వదిలి వైసిపి లో చేరటం ఖాయంగా కనిపిస్తోంది.
సునీల్ చేరికతో సమీకరణాల మార్పు..
2014 ఎన్నికల్లో కాకినాడ నుండి వైసిపి అభ్యర్దిగా పోటీ చేసిన చలమలశెట్టి సునీల్ కొద్ది పాటి తేడాతో టిడిపి అభ్యర్ది తోట నర్సింహం చేతిలో పరాజయం పాలయ్యారు. అంతుకు ముందు 2009 లో ప్రజారాజ్యం అభ్యర్ది గా పోటీ చేసారు. ఈ సారి కాకినాడ నుండి టిడిపి ఎంపీ అభ్యర్దిగా సునీల్ పోటీ చేయటం ఖాయమైంది. అయితే, వైసిపి నుండి ఎవరు బరిలో ఉంటారనేది ఇంకా స్పష్టత రాలేదు. ఇదే సమయంలో తోట నర్సింహం వైసిపిలో చేరుతారని.. ఆయన వైసిపి కాకినాడ ఎంపీ అభ్యర్దిగా పోటీలో ఉంటారని ప్రచారం జరిగింది. అయితే, ఇప్పుడు ఆయన ఎన్నికల్లో పోటీ చేయనని చెబుతున్న సమయంలో..వైసిపి ఎవరిని ఇక్కడ బరిలో దించుతుందనేది ఆసక్తి కరంగా మారింది.
తోట త్రిమూర్తులు ఎటు..
టిడిపి సీనియర్ నేత..రామచంద్రా పురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు టిడిపి లో కొనసాగుతారా లేక పార్టీ మారుతారా అనేది ఇంకా స్పష్టత రావటం లేదు. ఆయన తో కొద్ది రోజుల క్రితం ఆమంచి కృష్ణ మోహన్ భేటీ తో ఈ చర్చ కు మరిం త బలం చేకూరింది. ఆయన ఆ తరువాత హైదరాబాద్ లో తలసాని తో సమావేశమయ్యారు. కానీ, అది స్నేహ పూర్వ కంగానే జరిగిందని త్రిమూర్తులు చెప్పుకొచ్చారు. ఇక, ముఖ్యమంత్రితో సమావేశమైన తరువాత తాను టిడిపి మారాల్సి న అవసరం ఏంటని ప్రశ్నించారు. తాజాగా, ఆయన కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసారు. కానీ, తన తుది నిర్ణ యం ఏంటనే అంశం మాత్రం స్పష్టం చేయలేదు.