మూడు రాజధానుల నిర్ణయం .. ప్రతిపక్షాలకు చెక్ పెడుతుందా ? జగన్ కు ప్లస్ అవుతుందా?
Recommended Video
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులపై చేసిన ప్రకటన రాజకీయంగా జగన్ కు లాభిస్తుందా? అభివృద్ధి వికేంద్రీకరణ చెయ్యాలని,అలా చేస్తేనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని సీఎం జగన్ సూచనప్రాయంగా ప్రకటన చేయడం వెనుక బలమైన కారణం ఉందా? ఏపీలో ప్రతిపక్షాలను దెబ్బకొట్టే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ ఏమైనా ఉందా? అంటే అవును అనే రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
మూడు ముక్కలాట..ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖ..రీజన్ ఇదేనా !
జగన్ మూడు రాజధానుల ఆలోచనపై రాజకీయవర్గాల్లో చర్చ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల ఆలోచన ఆచరణ సాధ్యమేనా అన్న విషయం అటుంచితే అసలు.. ఈ ఆలోచన వెనుక స్ట్రాటజీ ఏమిటన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాజకీయ పరంగా జగన్మోహన్ రెడ్డి తాను తీసుకున్న నిర్ణయంతో మూడు ప్రాంతాల ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నారు అని ఆయన అభిమానులు భావిస్తున్నారు.దీంతో వైసీపీ ఇమేజ్ అమాంతం పెరిగిపోతుంది అని భావిస్తున్నారు.
కోస్తా ఆంధ్ర, ఉత్తరాంధ్ర అలాగే రాయలసీమ ప్రాంతాలలో జగన్ కు పెరగనున్న క్రేజ్
అమరావతిని.. కేవలం చట్టసభలకు పరిమితం చేయడం , అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని తన ఉద్దేశాన్ని బహిర్గతం చేయడం ద్వారా ఏపీలోని అన్ని ప్రాంతాల ప్రజల నుండి వైసిపి అధినేత, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి విపరీతమైన మైలేజ్ రానుంది. మెట్రో సిటీ అయిన విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చేయాలని, అలాగే కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని భావించడం ఆయా ప్రాంతాల ప్రజలకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. అటు కోస్తా ఆంధ్ర, ఉత్తరాంధ్ర అలాగే రాయలసీమ ప్రాంతాల అభివృద్ధికి పట్టం కట్టినట్టు భావిస్తున్నారు ప్రజలు .
రాయలసీమా వాసుల చిరకాల కాంక్ష నెరవేర్చే నిర్ణయం
కర్నూలులో హైకోర్టు కోసం చాలా కాలంగా అక్కడ ఆందోళనలు జరుగుతున్నాయి. వారి డిమాండ్ ను పరిష్కరిస్తూ కర్నూలు కు ప్రాధాన్యత ఇచ్చినట్లు ఉంటుందని, అక్కడ కూడా రాజధాని ఏర్పాటు చేసినట్లు ఉంటుందని సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. అలాగే.. ఉత్తరాంధ్రలో కార్యనిర్వాహక రాజధాని పెట్టడం ద్వారా.. అక్కడ కూడా రాజకీయ మైలేజీ వస్తుందని జగన్ ఆశించినట్లుగా తెలుస్తోంది.
ప్రతిపక్ష పార్టీలను నోరెత్తనీయకుండా చేసిన ప్రకటన
సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చేసిన ప్రకటనను టిడిపి మాత్రమే విమర్శిస్తుంది. ఈ విషయంపై టిడిపి కేవల అమరావతి రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేస్తే, రాయలసీమ కోస్తాంధ్ర ప్రాంతాల్లో టిడిపి పట్ల ప్రజల వ్యతిరేకత ఏర్పడుతుంది. దీంతో ప్రతిపక్ష పార్టీలను సైతం నోరెత్తనీయకుండా చాలా వ్యూహాత్మక నిర్ణయం తీసుకొని దెబ్బ కొట్టారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఇప్పుడు విపక్ష పార్టీలు కానీ.. సొంత పార్టీల నేతలు కానీ ఈ నిర్ణయంపై నోరెత్తే అవకాశం లేదు.
జగన్ నిర్ణయం వ్యతిరేకిస్తే ప్రతిపక్షాలకు రాజకీయంగా దెబ్బ తగిలే అవకాశం
ఏవరైనా సీఎం జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటన వ్యతిరేకిస్తే ఆ ప్రాంతానికి వారు వ్యతిరేకమనే వాదనను తెరపైకి తెస్తారు కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆచితూచి మాట్లాడాల్సిన పరిస్థితి నెలకొంది. జగన్ చేసిన ప్రకటన రాజకీయంగా ఆయనకు భారీ మైలేజ్ తీసుకువస్తుంది అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతుంది. ఇక ఈ ప్లస్ అలా ఉంటె జగన్ చెప్పిన మూడు రాజధానుల ఫార్ములా ఆచరణ సాధ్యమా అన్న చర్చ మాత్రం ప్రస్తుతం ప్రధానంగా జరుగుతుంది.