జగన్ కోసం 3 జైళ్లు, రోజా లాగే వాసిరెడ్డి పద్మ: వర్ల కౌంటర్
విజయవాడ: పనామా పేపర్స్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పేరు వస్తుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ నాయకుడు వర్ల రామయ్య తీవ్రంగా ప్రతిస్పందించారు. వైసిపి అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కోసం మూడు జైళ్లు ఎదురు చూస్తున్నాయని అన్నారు.
జగన్ కోసం దేశ రాజధానిలోని ఓ జైలు, హైదరాబాదులోని రెండు జైళ్లు ఎదురు చూస్తున్నాయని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. జగన్ లేకుండా పార్టీని నిలబెట్టుకునే ప్రయత్నం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు చేయాలని ఆయన సూచించారు.
వాసిరెడ్డి పద్మ నిస్పృహతో మాట్లాడుతున్నారని, పనామా పేపర్స్లో చంద్రబాబు పేరు చూడాలని కోరుకుంటున్న వాసిరెడ్డి పద్మ వారి పార్టీ అధినేత జగన్ గతాన్ని గుర్తు చేసుకోవాలని, జగన్ 16 నెలలపాటు జైలు జీవితం గడిపారని ఆయన అన్నారు. రెండోసారి జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు.

జగన్ తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 43 వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించాడని ఆయన ఆరోపించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముగిసిన తర్వాత ఎక్కడ ఉంటారో ఊహించుకోవాలని ఆయన అన్నారు. తీహార్ జైలుకు వెళ్తారా, లేదంటే హైదరాబాదులోని చర్లపల్లి లేదా చంచలగుడా జైలుకు వెళ్తారా చూసుకోవాలని ఆయన అన్నారు.
వాసిరెడ్డి పద్మ రాజకీయాలను పార్టీ పెయిడ్ వర్కర్ స్థాయికి దిగజార్చారని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబుపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళా నేతలు చేస్తున్న వ్యాఖ్యలు దారుణంగా ఉంటున్నాయని ఆయన అన్నారు. ఇటీవల రోజా, గిడ్డి ఈశ్వరి చంద్రబాబుపై చేసిన విమర్శల మాదిరిగానే వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యలున్నాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications