Vijayawada లోక్ సభ సీటు దక్కేదెవరికి - రేసులో ఆ ముగ్గురు..!!
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికలకు అభ్యర్ధుల ఖరారు పైన ప్రధాన పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. ఈ సారి విజయవాడ లోక్ సభ స్థానం పైన ఆసక్తి కనిపిస్తోంది. టీడీపీ నుంచి ముగ్గురు పేర్లు రేసులో ఉన్నాయి. వైసీపీ నుంచి గతంలో పోటీ చేసిన అభ్యర్ధి కూడా టీడీపీ ఆశావాహుల జాబితాలో ఉన్నారు. వైసీపీ కొత్త లెక్కలు తెర మీదకు తెస్తోంది. దీంతో, కీలకమైన విజయవాడ లోక్ సభలో బరిలో నిలచేదెవరనేది ఉత్కంఠ పెంచుతోంది.
టీడీపీ నుంచి ఆశావాహులు : విజయవాడలో వైసీపీ కంటే టీడీపీ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. 2014,2019 ఎన్నికల్లో వరుసగా టీడీపీ నుంచి గెలిచిన కేశినేని నాని ఈ సారి పోటీ చేస్తారా లేదా అనే చర్చ కొనసాగుతోంది. కేశినేని నాని జిల్లా టీడీపీ నేతల పైన ఆగ్రహంతో ఉన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.

వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొనటం..తాను అవసరమైతే స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తానని చెప్పటం పార్టీలో వివాదానికి కారణమైంది. ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పార్లమెంట్ సమావేశాలపై నిర్వహించిన సమావేశానికి నాని హాజరయ్యారు. ఇదే సమయంలో విజయవాడ లోక్ సభ స్థానం నుంచి కేశినేని చిన్ని కూడా రేసులో ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.
రేసులో ముగ్గురు నేతలు : కేశినేని నాని ..కేశినేని చిన్ని విషయంలో హైకమాండ్ సైతం ఆచి తూచి స్పందిస్తోంది. నాని ఈ సారి పోటీ చేస్తే ఆయనకు నగర పరిధిలోని రెండు నియోకవర్గాల నుంచి ఏ మేరకు మద్దతు లభిస్తుందనేది సందేహంగా కనిపిస్తోంది. అదే సమయంలో కేశినేని చిన్న పార్టీ కార్యక్రమాల ద్వారా చంద్రబాబును ప్రసన్నం చేసుకొని సీటు దక్కించుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు.
చిన్నికి పార్టీ స్థానిక నేతలు మద్దతుగా నిలుస్తున్నారనే అభిప్రాయం ఉంది. ఇదే సమయంలో గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన పీవీపీ సైతం కొంత కాలంగా టీడీపీ అనుకూల వైఖరితో ఉన్నట్లుగా విజయవాడ పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం సాగుతోంది.

చంద్రబాబు నిర్ణయం ఏంటి : కేశినేని నాని చేసిన వివాదాస్పద వ్యాఖ్యల సమయంలో పీవీనీ గట్టిగా కౌంటర్ ఇస్తూ వరుస ట్వీట్లు చేసారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇంకా ఎన్నికలకు సమయం ఉండటం...జనసేన, బీజేపీతో పొత్తు పైన స్పష్టత వచ్చిన తరువాతనే కీలకమైన విజయవాడ సీటు పైన టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.
కేశినేని నాని వైఖరితో గుర్రుగా ఉన్న పార్టీ నేతలు ఆయనకు సీటు ఇస్తే సహకరిస్తారా లేదా అనేది పార్టీ నాయకత్వానికి అంతుచిక్కని అంశంగా మారుతోంది. ఈ క్రమంలో విజయవాడ లోక్ సభ సీటు పైన చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications