రిషికేశ్వరి పేరిట ఫేస్బుక్, మృతికి కారణమైన యువతి ఫోటో: త్రిసభ్య కమిటీతో విచారణ
గుంటూరు: నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న రిషికేశ్వరి పేరిట ఓ ఫేస్బుక్ పేజీ ప్రారంభం కాగా, నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఆమె మృతికి కారకులు వీరేనంటూ పోలీసులు అరెస్టు చేసిన ఇద్దరు సీనియర్ విద్యార్థులు, ఓ విద్యార్థిని ఫోటోను ఉంచారు. దీనిపై పలు ప్రశ్నలు సంధించారు.
ఇదిలా ఉండగా, నాగార్జున విశ్విద్యాలయంలో ఆర్కిటెక్టర్ విద్యార్థిని రిషికేశ్వరి ఆత్మహత్య ఘటన విచారణకు త్రిసభ్య కమిటీ నియమించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో దీనిని ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది.
ఇందులో సభ్యులుగా ఇతర విశ్వవిద్యాలయాలకు చెందిన ఇద్దరు అధ్యాపకులను నియమించాలని భావిస్తున్నారని సమాచారం. విశ్వవిద్యాలయ ప్రక్షాళనలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కుల, మత, విద్యార్థి సంఘాల పేరుతో వర్సిటీలో ఉన్న బోర్డులను తొలగించాలని శనివారం ఆదేశించారు.
విశ్విద్యాలయానికి పది రోజులు సెలవులు ఇచ్చిన సందర్భంగా విద్యార్థులు అందరూ శనివారం మధ్యాహ్నానికే వసతి గృహాలు ఖాళీ చేశారు. వాళ్లు వెళ్లిన గంటల వ్యవధిలోనే పోలీసులు బందోబస్తు మధ్య బోర్డులను తొలగించారు.