కాంగ్రెస్కు ముగ్గురు ఎమ్మెల్యేల రిజైన్: 17తర్వాత కిరణ్!
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లును గురువారం మధ్యాహ్నం లోకసభలో ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజీనామాల పర్వం ప్రారంభమైంది. కాంగ్రెసు పార్టీకి సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వారు ఫ్యాక్స్ ద్వారా తమ రాజీనామాలను పంపించారు.
ఎమ్మెల్యేలు శ్రీధర కృష్ణా రెడ్డి, ఆదాల ప్రభాకర్, బండారు సత్యానంద రావులు కాంగ్రెసు పార్టీకి, తమ శాసన సభ్యత్వాలకు గురువారం మధ్యాహ్నం రాజీనామా చేశారు. వారు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీలకు తమ రాజీనామా లేఖలను పంపించారు. ఇప్పటికే ఎమ్మెల్యే రౌతు సూర్య ప్రకాశ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
ధర్నా తర్వాత కిరణ్ నిర్ణయం!
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామాపై నిర్ణయాన్ని ఈ నెల 17 తర్వాత తీసుకునే అవకాశాలున్నాయి. తెలంగాణ బిల్లు పార్లమెంటులో ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో ఈ నెల 17వ తేదీ ఢిల్లీకి వెళ్లాలని సీమాంధ్ర కాంగ్రెసు నేతలు భావిస్తున్నారు. 10 రైళ్లలో జనాలను తరలించారని చూస్తున్నారు. అక్కడి ధర్నాలో కిరణ్ కూడా పాల్గొనే అవకాశాలున్నాయి. ఆ ధర్నా తర్వాత కిరణ్ నిర్ణయం తీసుకునే అవకాశముందంటున్నారు.
పార్లమెంటు వ్యవహారాల బులెటిన్లో తెలంగాణ బిల్లు
మరోవైపు, పార్లమెంటు వ్యవహారాల బులెటిన్లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ఉంది. లోకసభ అజెండా అదనపు జాబితాలో ఉంది. దీనిని మొదట హోంమంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ప్రవేశ పెడతారనుకున్నప్పటికీ, హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రవేశ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.