హెచ్చరికలు: కేసీఆర్కు కోపం తెప్పించిన జగన్, లోకేష్!
హైదరాబాద్: తెలంగాణలో ఇటీవల రాజకీయ వేడి కనిపిస్తోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ పైన దృష్టి సారించడం, షర్మిల పరామర్శ యాత్ర చేస్తుందని చెప్పడం, అదే సమయంలో తెరాస నాలుగేళ్లలో పోతుందని చెప్పడం, మరోవైపు టీడీపీ ఎమ్మెల్యేలు కొందరు తెరాసలో చేరడం, తెలంగాణ కాంగ్రెస్, తెలంగాణ టీడీపీ నేతలు భరోసా యాత్ర, బస్సుయాత్రలు చేస్తుండటంతో తెలంగాణలో రాజకీయం వాడిగావేడిగా కనిపిస్తోంది.
ఎన్నికలకు ముందు, తర్వాత కూడా తెలంగాణను జగన్ వదిలేశారనే వాదనలు వినిపించాయి. అయితే, రెండు రోజుల క్రితం జగన్ తెలంగాణ ప్రాంత నేతలతో భేటీ అయి, పార్టీ పటిష్టత పైన దృష్టి సారించారు. అందుకు అనుగుణంగా షర్మిలతో యాత్ర చేయించనున్నారు. ఈ సమయంలో ఆయన తెరాస ప్రభుత్వం పైన నిప్పులు చెరిగారు. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం పైన అప్పుడే వ్యతిరేకత వచ్చిందని, తెరాస పైన రావడానికి మరికొద్ది రోజులు పట్టవచ్చనని, నాలుగేళ్ల తర్వాత తెరాస ఉండదన్నారు.
నాలుగేళ్ల తర్వాత తెరాస ఉండదని.. జగన్ చేసిన వ్యాఖ్యలు తెరాసకు, కేసీఆర్కు ఆగ్రహం తెప్పించినట్లుగా కనిపిస్తున్నాయి. దీంతో తెరాస ఎదురుదాడికి దిగింది. మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, మహేందర్ రెడ్డి ఆ పార్టీ ఇతర నేతలు జగన్, షర్మిలల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఆంధ్రా నేతలు పర్యటిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తెలంగాణలో ఆంధ్రా నేతల పెత్తనం చెల్లనివ్వమని అభిప్రాయపడ్డారు.

మరోవైపు, తెరాస, టీడీపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నలుగురు ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ కేసీఆర్ను గురువారం కలిసినప్పటి నుండి మాటల యుద్ధం ఎక్కువైంది. శుక్రవారం నాటి తమ బస్సుయాత్రను పక్కదోవ పట్టించేందుకే తెరాస తమ ఎమ్మెల్యేల పైన ఆపరేషన్ ఆకర్ష్ ఉపయోగించిందని టీడీపీ ఆరోపిస్తోంది.
లోకేష్కు తెలంగాణ బాధ్యతలు కట్టబెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఎమ్మెల్యేలు తీగల కృష్ణా రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ గంగాధర గౌడ్లు కారు ఎక్కుతామని చెప్పారు. ఒక్క ఎమ్మెల్యే మాత్రం యూ టర్న్ తీసుకున్నారు. టీడీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.
లోకేష్కు తెలంగాణ బాధ్యతలు అప్పగించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారన్న తెరాస ఆరోపణలను తెలంగాణ టీడీపీ నేతలు కొట్టిపారేశారు. లోకేష్ కూడా ట్విట్టర్లో కేసీఆర్ పైన వ్యాఖ్యలు చేయడం ద్వారా మరింత వేడి రాజేశారు. తెలంగాణలో అభివృద్ధి పైన చంద్రబాబుతో కేసీఆర్ చర్చకు సిద్దమా అని సవాల్ విసిరారు.
దానికి మంత్రి జగదీశ్వర్ రెడ్డి స్పందిస్తూ.. చంద్రబాబుతో చర్చకు మంత్రులం చాలమని, కేసీఆర్ అవసరం లేదని చెప్పారు. దానికి లోకేష్ మరింత ఘాటుగా ట్వీట్ చేశారు. కేసీఆర్కు చంద్రబాబుతో చర్చించేందుకు గట్స్ లేవని మరోసారి తేటతెల్లమయిందని, అందుకే మంత్రులను రంగంలోకి దింపారని సెటైర్లు వేశారు.












Click it and Unblock the Notifications