రాగల మూడు గంటలల్లో.. ఏపీలోని ఈ జిల్లాల్లో..!!
ఏపీలో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల కొద్దిరోజులుగా రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. ప్రత్యేకించి- కోస్తాజిల్లాలపై దీని తీవ్రత అధికంగా కనిపించింది. ఇదే పరిస్థితి ఈ సాయంత్రం, శనివారం కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. బలమైన ఈదురుగాలులు వీయడానికి వాతావరణం అనుకూలంగా మారింది.
వచ్చే మూడు గంటల్లో ఉత్తరాంధ్రలో పిడుగలతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో ఈ రాత్రి నాటికి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ మేరకు సంబంధిత ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ సైతం జారీ అయింది. ఈ అయిదు జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడొచ్చని పేర్కొంది. మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసేందుకు ఆస్కారం ఉందని వివరించింది.

ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో వర్షంతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ సమయంలో పిడుగులు పడే ప్రమాదం కూడా ఎక్కువగా ఉందని, ఆరుబయట ఉన్న వాళ్లు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో ఉన్నవారు చెట్ల కింద గానీ, విద్యుత్ స్తంభాల సమీపంలో గానీ ఉండకూడదని విజ్ఞప్తి చేసింది.
ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే కాకుండా రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఇదే విధమైన వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని వెల్లడించింది. చాలా చోట్ల ఆకాశం మేఘావృతమై ఉంటుందని పేర్కొంది. అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడొచ్చు. ఈ రెండు రోజుల్లో గాలి వేగం మరింత పెరిగి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వరకు వీచే వీలుంది. పిడుగులు పడుతున్నప్పుడు, బలమైన ఈదురు గాలులు వీచే సమయంలో ప్రజలు హోర్డింగులు, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు వంటి ప్రదేశాల వద్ద నిల్చోకూడదని విపత్తు నిర్వహణ సంస్థ కోరింది.












Click it and Unblock the Notifications