సోనియా ట్విస్ట్, డైరెక్టర్కి ఎమ్మెల్సీ: కెసిఆర్ డైలమా
హైదరాబాద్: తెలంగాణ ప్రాంతంలో నామినేషన్కు గడువు రేపటితో (బుధవారం)తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల్లో అసంతృప్తులు రోడ్డెక్కుతున్నారు. పార్టీ కార్యాలయాల వద్ద ఆందోళనలు చేస్తున్నారు. టిక్కెట్ల అంశంపై ట్విస్టులు కొనసాగుతున్నాయి.
కాంగ్రెసు పార్టీలో...
కాంగ్రెసు పార్టీ తన జాబితాలో జెఏసి నేతలకు టిక్కెట్లు కేటాయించలేదు. దీనిపై తెలంగాణ కాంగ్రెసు నేతలు పెదవి విరిచారు. మరోవైపు జెఏసి నేతలు మంగళవారం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. ఈ నేపథ్యంలో చివరి నిమిషంలో కాంగ్రెసులో స్వల్ప మార్పులు చోటు చేసుకోనున్నాయి. కాంగ్రెసు పార్టీ లిస్టులో మూడు శాసన సభ నియోజకవర్గాల్లో అభ్యర్థులు మారే అవకాశముంది. నర్సంపేట కత్తి వెంకటస్వామికి, కంటోన్మెంట్ గజ్జెల కాంతంకు, తుంగతుర్తి అద్దంకి దయాకర్కు ఇచ్చే అవకాశముంది.
ఇందుకు సంబంధించి తెలంగాణ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్యకు అధిష్టానం ఫోన్ చేసి చెప్పింది. ఆయా నియోజకవర్గాల వారికి బిఫారం ఇవ్వవద్దని సూచించింది. అయితే, నర్సంపేట అభ్యర్థిని మార్చవద్దని కేంద్రమంత్రి బలరాం నాయక్ అధిష్టానాన్ని కోరారు.
డైరెక్టర్ శంకర్కు ఎమ్మెల్సీ హామీ
జెఏసి నేత రాజేందర్ రెడ్డి సోనియా గాంధీని కలిసిన అనంతరం మాట్లాడారగు. ముగ్గురు జెఏసి నేతలకు టిక్కెట్లు ఇస్తామని సోనియా చెప్పారన్నారు. డైరెక్టర్ శంకర్, తనకు ఎమ్మెల్సీ అవకాశమిస్తామన్నారు. వారికి కొప్పుల రాజు అపాయింటుమెంట్ ఇచ్చారు.
తెరాసలో వారికి దక్కని టిక్కెట్..
తెలంగాణ రాష్ట్ర సమితిలో పలువురు ప్రముఖులకు ఇప్పటి వరకు టిక్కెట్ దక్కలేదు. తెరాస ఇప్పటి వరకు 109 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరో పది స్థానాలపై కెసిఆర్ మల్లగుల్లాలు పడుతున్నారు. నాయని నర్సింహా రెడ్డి, శ్రవణ్ కుమార్ తదితర తెరాస నాయకులు ముషీరాబాద్, భువనగిరి స్థానాలపై ఆశలు పెట్టుకున్నా.. అవకాశం దక్కలేదు. కాగా, టిక్కెట్ కోసం తెరాస, టిడిపి, కాంగ్రెసు పార్టీ కార్యాలయాల వద్ద నేతలు, వారి అనుచరులు ఆందోళన చేస్తున్నారు.
వనమా రాకపై ఆందోళన
కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత వనమా వెంకటేశ్వర రావు మంగళవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. ఆయన రాకను కృష్ణ వర్గం వ్యతిరేకిస్తోంది. ఖమ్మంలో జగన్ పార్టీ పని అయిపోయిందని కృష్ణ వర్గం మండిపడుతోంది.