తిరుమల నుంచి బెగ్గర్స్ అవుట్?
Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం నాడు 63,607 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 23,856 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 3.87 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు క్యూలైన్ ఏర్పడింది. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 18 నుంచి 24 గంటల సమయం పట్టింది. కంపార్ట్ మెంట్లు, క్యూలైన్లల్లో ఉన్న భక్తులకు శ్రీవారి సేవకులు, టీటీడీ సిబ్బంది అల్పాహారం, పాలు పంపిణీ చేశారు.

శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు వచ్చే లక్షలాదిమంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా టీటీడీ అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటోన్నారు. ఈ ఏడాది ఎనిమిది లక్షలమందికి పైగా భక్తులు తిరుమలకు వస్తారని అంచనా వేసింది. దీనికి అనుగుణంగా చర్యలు చేపట్టింది.
ఇందులో భాగంగా యాచకులు, అనధికారిక వ్యాపారులను తిరుమల నుండి తరలించింది. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది టీటీడీ. యాచకులు, అనధికార వ్యాపారులను తిరుమల నుండి తరలిచేందుకు టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి మురళీకృష్ణ, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు తిరుమల పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.
కళ్యాణకట్ట, ఎస్వీ షాపింగ్ కాంప్లెక్స్ ప్రాంతాల్లో ఉన్న 82 మంది యాచకులు, అనధికార వ్యాపారులను గుర్తించి కిందకు పంపించారు. అనుమానితుల వేలిముద్రలు కూడా పరిశీలించారు. స్థానిక హోటళ్లు, టీ దుకాణాలు, చిల్లర దుకాణాల యజమానులు, తిరుమలలో పని ముగించిన తర్వాత, తమ వద్ద పనిచేసే వారికి తగిన వసతిని తిరుపతిలో కల్పించాలని పోలీసులు సూచించారు.
ట్రయల్ రన్..
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవ వాహనసేవల ట్రయల్ రన్ ఆరంభమైంది. ఇందులో భాగంగా సూర్యప్రభ వాహనం పటిష్టతను పరిశీలించేందుకు బుధవారం టీటీడీ అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ వాహన సేవ సమయంలో వాహనబేరర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులు పరిశీలించారు.












Click it and Unblock the Notifications