వార్దాతో తిరుమలలో కుంభవృష్టి: ఆలయ ప్రాంగణంలోకి నీరు
వార్ధా తుఫాను ప్రభావం తిరుమలపై తీవ్రంగా పడింది. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఈదురుగాలులతో పాటు వర్షాలు పడుతున్నాయి.
విజయవాడ: వార్దా తుఫాను ప్రభావంతో తిరుమల విలవిలలాడుతోంది. తిరుమలలో కుంభవృష్టి కురుస్తోంది. ఆలయ ప్రాంగణంలోకి నీరు వచ్చి చేరింది. దీంతో భక్తులు బిక్కుబిక్కుమంటున్నారు. ఆలయ ప్రాంగణంలోని నీటిని ఫైరింజన్ల ద్వారా తోడేస్తున్నారు. తిరుమలలోని భక్తులు అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నారు. తిరుపతిలో రవామా వ్యవస్థ స్తంభించింది.
రేణిగుంటలోని విమానాశ్రయాన్ని మూసేశారు. చెన్నైకి వెళ్లే మార్గంలో దాదాపుగా దారులు మూసుకుపోయాయి. వాహనాలేవీ అటుగా వెళ్లడం లేదు. కాగా, నెల్లూరు వరకు కొన్ని రైళ్లు నడుస్తున్నాయి. నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సరిహద్దుల్లో పరిస్థితి బీభత్సంగా ఉంది. నెల్లూరు జిల్లా తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి. తడలో పెనుగాలులు వీస్తున్నాయి. తీరం దాటాక నాలుగు గంటల పాటు వర్షాలు పడుతాయని వాతావరణ పరిశోధన కార్యాలయం అధికారులు చెప్పారు.
చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. రేపు మంగళవారంనాడు భారీ వర్షాలు ఉంటాయి. కడప, అనంతపురం జిల్లాల్లో ఎల్లుండి కూడా వర్షాలు పడుతాయని అంచనా వేస్తున్నారు. 13, 14 తేదీల్లో కొంత మేరకు వర్షాలుంటాయని చెబుతున్నారు.
ప్రకాశం జిల్లాలో వార్ధా తుఫాను కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారింది. పెద్ద యెత్తున అలలు ెగిసి పడుతున్నాయి.