తిరుమలకు వాహనదారులకు ముఖ్య గమనిక.. కొత్త రూల్ తెలుసుకోండి!
తిరుమల వెళ్ళే భక్తులకు అలెర్ట్. కలియుగ ప్రత్యక్ష దైవం , ఏడు కొండలపైన కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన క్షేత్రంలో ఆధ్యాత్మిక ప్రశాంతతను కాపాడేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలకు వెళ్ళే వాహనదారులు ఈ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని సూచించింది.
వాహనదారులకు టీటీడీ కీలక అలెర్ట్
తిరుమలను నో హారన్ జోన్ గా ప్రకటించి, అనవసరంగా హారన్ మోగించకూడదని భక్తులు, వాహనదారులకు టీటీడీ సూచనలు చేసింది. 'సైలెంట్ తిరుమల ఇనిషియేటివ్' పేరుతో ఈ కొత్త నిబంధన అమలులోకి వచ్చింది. ఆలయ ప్రాంతంలో శబ్ద కాలుష్యాన్ని తగ్గించి, భక్తులు గోవింద నామస్మరణలో మునిగి ఉండే వాతావరణం సృష్టించడమే దీని లక్ష్యం అని పేర్కొంది. తిరుమలలోని ఆధ్యాత్మిక వాతావరణానికి భంగం కలగకుండా చర్యలు చేపట్టే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

బోర్డులు పెట్టి అవగాహన కల్పిస్తున్న టీటీడీ
తిరుమలకు వెళ్లే ప్రధాన మార్గాలు, కొండపైని వివిధ ప్రాంతాల్లో బోర్డులు ఏర్పాటు చేసి భక్తులకు అవగాహన కల్పిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు, ట్యాక్సీలు, టీటీడీ మరియు పోలీసు వాహనాలు సహా అన్ని వాహనాలు ఈ నియమాన్ని పాటించాలి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే సైరన్లు ఉపయోగించాలని, వీఐపీ కాన్వాయ్లు కూడా అనవసరంగా హారన్ వాడకూడదని అధికారులు తెలిపారు.
బాగా పెరిగిన భక్తుల రద్దీతో శబ్ద కాలుష్య నివారణకు నిర్ణయం
పోలీసులు మరియు టీటీడీ విజిలెన్స్ బృందాలు కొండపైని ప్రధాన మార్గాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇటీవలి కాలంలో తిరుమలలో భక్తుల సంఖ్య మరియు వాహనాల రద్దీ భారీగా పెరిగింది. రోజుకు వేలాది వాహనాలు కొండ ఎక్కుతున్న నేపథ్యంలో శబ్ద కాలుష్యం పెరిగి ఆధ్యాత్మిక వాతావరణానికి భంగం కలుగుతోంది. ఆలయ పరిసరాల్లో పగటి వేళలో 50 డెసిబల్స్, రాత్రి సమయంలో 40 డెసిబల్స్ మించకుండా శబ్దాలు ఉండాలని నిబంధనలు ఉన్నాయి.
తిరుమల ఆధ్యాత్మిక పవిత్రత కాపాడేలా నిర్ణయం
ఈ కొత్త చర్య ద్వారా భక్తులు మరింత ప్రశాంతంగా స్వామి దర్శనం చేసుకోవడానికి వీలవుతుంది. టీటీడీ అధికారులు భక్తులందరూ ఈ నిబంధనలను పాటించి, తిరుమలను నిజమైన ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ చర్యలు తిరుమలలోని పర్యావరణ సంరక్షణకు, భక్తుల అనుభవాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడతాయని టీటీడీ అధికారులు భావిస్తున్నారు. .












Click it and Unblock the Notifications