తిరుమల శ్రీవారి లక్ష్మీ కాసుల హారాన్ని కళ్లారా చూసే మహద్భాగ్యం..!!
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. గురువారం నాడు 59,776 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 22,386 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.24 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 30 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది నుంచి 10 గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది అన్నప్రసాదాలు, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి లక్ష్మీ కాసుల హారాన్ని నేడు ఊరేగించనున్నారు టీటీడీ అధికారులు. శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రాత్రి గరుడ వాహనసేవ అత్యంత వైభవంగా జరుగనుంది. రాత్రి 7 నుండి 9 గంటల వరకు తనకు ప్రీతిపాత్రమైన గరుడవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
శ్రీవారి గరుడసేవకు ఆలయంలో టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆలయంలో ప్రత్యేక పుష్ప, విద్యుత్ దీపాలంకరణలు పూర్తి చేశారు. భక్తులకు అన్నప్రసాదాలు, మంచినీరు, పాలు, మజ్జిగ పంపిణీ చేయనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విజిలెన్స్, పోలీస్ విభాగాల సమన్వయంతో ట్రాఫిక్కు ఇబ్బందులు లేకుండా వాహనాల పార్కింగ్ తో పాటు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
గరుడసేవలో స్వామివారికి అలంకరించేందుకు తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం నుంచి శనివారం మధ్యాహ్నం 2 గంటలకు తిరుమల శ్రీవారి లక్ష్మీహారాన్ని ఊరేగింపుగా తీసుకెళతారు. కల్యాణ వెంకటేశ్వర స్వామివారికి అలంకరిస్తారు. అలాగే- తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుంచి ఈ ఉదయం శ్రీ ఆండాళ్ అమ్మవారి మాలల ఊరేగింపు ప్రారంభమవుతుంది. నగర వీధుల్లో ఊరేగింపుగా 11 గంటలకు శ్రీనివాసమంగాపురానికి చేరుకుంటాయి.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి అనంత తేజోమూర్తి అయిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడు బకాసుర వధ అలంకారంలో సర్వభూపాల వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 గంటలకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.
వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.












Click it and Unblock the Notifications