టీటీడీ ఆలయాల్లో ఎస్సీ, ఎస్టీ అర్చకులు...త్వరలోనే నియామకాలు చేపట్టనున్నట్లు వెల్లడించిన ఈవో...
Recommended Video

తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఒక విప్లవాత్మక నిర్ణయానికి రంగం సిద్ధం అయింది. తరతరాల కట్టుబాట్లను పక్కనబెట్టి సామాజిక చైతన్యానికి పెద్ద పీట వేస్తూ టిటిడి చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. కేవలం బ్రాహ్మణులకే పరిమితమైన అర్చకుల పోస్టుల్లో ఎస్సీ ఎస్టీలను నియమించేందుకు టిటిడి పాలకవర్గం సంసిద్దమైంది. బుధవారం ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో టిటిడి ఈవో అనిల్ సింఘాల్ ఈ విషయాన్ని వెల్లడించారు.

టిటిడి సరి కొత్త నిర్ణయం...
తరతరాలుగా దళితుల పట్ల కొనసాగుతున్న వివక్షకు తెరదించుతూ టిటిడి చరిత్రలోనే విప్లవాత్మకం అనదగ్గ ఒక నిర్ణయాన్ని ఆలయ
పాలకవర్గం తీసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ ఆలయాల్లో ఎస్సీ, ఎస్టీ యువకులను అర్చకులను నియమించడానికి టిటిడి సిద్ధమైంది. టీటీడీ ఈవో అనిల్ సింఘాల్ బుధవారం ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో టిటిడి నూతన నిర్ణయాల వివరాలు వెల్లడించారు.

తొలి బ్యాచ్ సిద్దం...
ఇప్పుడు ఇదే కోవలోనే టిటిడి ఆలయాల్లో దళిత యువకులను అర్చకులుగా నియమించేందుకు గాను వారికి శిక్షణ ఇస్తున్నట్లు టిటిడి ఈవో సింఘాల్ తెలిపారు. ఇప్పటికే తొలి బ్యాచ్ శిక్షణ పూర్తయిందని, త్వరలో మరో బ్యాచ్ను ప్రారంభించనున్నామని చెప్పారు. శిక్షణ పూర్తిచేసుకున్నతొలిబ్యాచ్ వారిని త్వరలోనే అర్చకులుగా నియమించనున్నట్లు వెల్లడించారు.

వీరి పోస్టింగ్ ఎక్కడంటే...
ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో టీటీడీ ఆధర్వంలో నిర్మించిన ఆలయాల్లో ఈ ఫస్ట్ బ్యాచ్ ఎస్సీ ఎస్టీ అర్చకులను నియమిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో టీటీడీ నిర్మించిన ధ్యానమందిరాలు, దేవాలయాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయని ఈవో సింఘాల్ ఈ సందర్భంగా చెప్పారు. మరిన్ని దేవాలయాను నిర్మించడానికి నాలుగు ఐటీడీఏల పరిధిలోని 500 గ్రామాలను ఎంపిక చేశామని ఆయన వివరించారు.

టిటిడికి స్ఫూర్తి టిడిబి...
దేవాలయాల్లో దళితులను అర్చకులు గా నియమించే చారిత్రాత్మక నిర్ణయం తొలిసారిగా ఆచరణలోకి తెచ్చింది కేరళలోని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ). ఈ బోర్డు మొట్టమొదటగా ఆరుగురు దళిత యువకులను వివిధ ఆలయాల్లో అర్చకులుగా నియమించింది. ఆ స్పూర్తితోనే ఇప్పుడు టీటీడీ కూడా ఎస్సీ, ఎస్టీ యువకులను అర్చకులుగా నియమించబోతోంది.

వేర్వేరు నియామక పద్దతులు...
అయితే ఆలయాల్లో దళిత అర్చకుల నియామక ప్రక్రియ పకడ్బందీగా విమర్శలకు తావులేకుండా నిర్వహిస్తున్నారు. ఈ అర్చకుల పోస్టుల కోసం టీటీడీ స్వయంగానే రిక్రూట్మెంట్ నిర్వహించగా కేరళ మాత్రం ఆ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఈ అర్చక నియామకాల కోసం ప్రవేశ పరీక్షను నిర్వహించింది. అనంతరం ఇంటర్వ్యూలు చేసి 62 మందిని ఎంపిక చేసింది. ఇలా ఎంపిక చేసిన వారిలో 42 మంది బ్రాహ్మణేతరులు ఉండటం విశేషం. ఈ 42 మందిలో 36 మంది బీసీలు ఉండగా.. ఆరుగురు ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన వారు ఉన్నారు. వీరందరికీ శిక్షణ ఇచ్చి ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు ఆధీనంలో ఉన్న పలు ఆలయాల్లో అర్చకులుగా నియమించారు. ఎస్సీ ఎస్టీ అర్చకుల నియామకంలో కేరళను ఆదర్శంగా తీసుకున్న టీటీడీ మాత్రం కేవలం దళిత యువకులనే ఎంపికచేసి వారిని అర్చకులుగా తీర్చుదిద్దుతోంది.












Click it and Unblock the Notifications