విద్యార్థిని తిరుపతమ్మ ఆత్మహత్య: ఆరుగురు నిందితుల అరెస్ట్
గుంటూరు: తోటి విద్యార్థుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని తిరుపతమ్మ(16) కేసుకు సంబంధించి ఆరుగురు వ్యక్తులను గుంటూరు పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో రెండ్రోజుల కిందట(ఆదివారం) ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.
మాచర్లలోని కృష్ణవేణి ఇంటర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుండేది. ఈ క్రమంలో తోటి విద్యార్థుల వేధింపులు తాళలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది.
తన మరణానికి ఆరుగురు విద్యార్థులే కారణమంటూ ఆ సూసైడ్ నోట్లో తిరుపతమ్మ పేర్కొంది. మాచర్ల పట్టణంలోని పలు కళాశాలల్లో చదువుతున్న ప్రేమ్రాజ్నాయక్, గాబ్రియేల్నాయక్, పవన్, ఆదినారాయణ, వెంకటేష్, సురేష్ల వేధింపులే కారణమని తెలిపింది. వారంతా వెల్దుర్తి మండల పరిధిలోని వెల్దుర్తి, శిరిగిరిపాడు, పలు తండాలకు చెందిన వారుగా చెప్పింది.
కాగా, రాష్ట్ర వ్యాప్తంగా పెనుదుమారాన్ని రేపిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య అనంతరం విద్యార్థులకు సరైన రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రిషికేశ్వరి తరహాలోనే తిరుపతమ్మ ఆత్మహత్య ఘటన చోటుచేసుకుందని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆగ్రహం చేస్తున్నారు.
ఆటో బోల్తా : 11 మందికి గాయాలు
నెల్లూరు జిల్లా దగదర్తి మండలం మనుబోలుపాడులో మంగళవారం ఓ ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 11 మంది గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు వెల్లడించారని పోలీసులు తెలిపారు.