పెళ్లి పేరుతో అబ్బాయిలు ట్రాప్ .. మూడు పెళ్ళిళ్ళు చేసుకున్న నిత్య పెళ్ళికూతురు.. ఆపై ఏం చేసేదంటే !!
అమ్మాయిలను , అబ్బాయిలు మోసం చెయ్యటమే కాదు అమ్మాయిలే అబ్బాయిలను మోసం చేస్తున్న సంఘటనలు రాష్ట్రంలో నిత్యకృత్యంగా మారాయి . పెద్దింటి అబ్బాయిలను టార్గెట్ చేసి వల వేసిన ఓ యువతి పెళ్లి పేరు చెప్పి అడ్డంగా వారిని దోచేస్తోంది. అమాయకురాలిలా నటిస్తుంది.. అనాధ అని చెప్పుకుని పెళ్లిళ్లు చేసుకుని అత్తవారింటి నుండి నగలు, నగదు మూటగట్టుకుని ఉడాయిస్తుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురిని పెళ్లి చేసుకొని మోసం చేసిన ఓ మాయ లేడి గుట్టు తిరుపతి పోలీసులు రట్టు చేశారు.
మోడల్ ఫోటోలు చూసి మోసపోయాడు .. 7లక్షలు సమర్పించుకున్నాడు.. ఏపీలో పెళ్లి పేరుతో మోసం
వల వేసి పెళ్ళాడి ఆపై దోచుకుని మోసాలకు పాల్పడుతున్న కిలాడి లేడీ
ఈ కిలాడీ లేడీ బారినపడిన యువకులు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసి లబోదిబోమంటే, ఖతర్నాక్ కిలాడీ చేసిన మోసాలు దర్యాప్తులో తెలుసుకున్న పోలీసులు అవాక్కయ్యారు. ఇక అసలు విషయానికి వస్తే అనాధ అని చెప్పుకొని, తనతో పాటు పని చేసే సహచర ఉద్యోగులైన యువకులకు వలవేసి, తెలివిగా పెళ్లి చేసుకుని ఆ తర్వాత నగలు,నగదు దోచుకుని మరొక చోటికి మకాం మార్చేస్తున్న మాయ లేడి నిత్య పెళ్లి కూతురు సుహాసినిని తిరుపతి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను విచారించిన క్రమంలో ఇప్పటికే ఆమె మూడు పెళ్లిళ్లు చేసుకున్నట్లుగా నిర్ధారించారు.
చిత్తూరు జిల్లాకు చెందిన సునీల్ తో పెళ్లి .. ఆపై మోసం
ఇటీవల చిత్తూరు జిల్లా విజయపురం మండలానికి చెందిన సునీల్ కుమార్ గత నెలలో అనాధనని చెప్పి పెళ్లి చేసుకొని, నగలు, నగదుతో పారి పోయిందని పోలీస్ స్టేషన్ లో సుహాసిని పై ఫిర్యాదు చేశారు. ఇక ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు తిరుపతిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న సుహాసినిని నేడు అరెస్టు చేశారు.ఇప్పటి వరకు ఆమె చేసిన మోసాల విషయానికి వస్తే చిత్తూరు జిల్లా సునీల్ ను పెళ్లి చేసుకున్న సుహాసిని తాను అనాధనని ముందు సునీల్ ని నమ్మించి పెళ్లి చేసుకుంది. పెళ్లికి ముందు సునీల్ దగ్గర నుండి రెండు లక్షలు ,పెళ్లి తర్వాత సునీల్ కి తెలియకుండా మామ నుండి రెండు లక్షల రూపాయలు తీసుకుంది.
మోసపోయానని గుర్తించి పోలీసులకు సునీల్ ఫిర్యాదు
ఈ విషయం తెలిసిన సునీల్ ఆమెను ప్రశ్నించగా ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. ఇక ఇంటి నుండి వెళ్లేటప్పుడు నగదు, నగలు కూడా తీసుకుని ఉడాయించింది. అయితే కొద్ది రోజుల తర్వాత ఆమె మరొక వ్యక్తితో ఉన్న ఆధార్ కార్డు సునీల్ కు దొరకడంతో, ఆధార్ కార్డును తీసుకుని సుహాసినిని సునీల్ నిలదీశాడు. దీంతో తనకు గతంలో పెళ్లి అయినట్లుగా చెప్పి సుహాసిని సునీల్ కు షాక్ ఇచ్చింది. తాను మోసపోయానని గుర్తించిన సునీల్ దాదాపు ఆరు లక్షల రూపాయల మేర నగలు, నగదు తన దగ్గర నుండి తీసుకు వెళ్లినట్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
గతంలో తెలంగాణా యువకుడిని పెళ్లి చేసుకుని మోసం చేసిన సుహాసిని
సునీల్ కంటే ముందు తెలంగాణలో కొత్తగూడెం ప్రాంతానికి చెందిన వినయ్ అనే వ్యక్తిని కూడా నమ్మించి మోసం చేసింది. 2018లో వినయ్ తో పరిచయం ఏర్పర్చుకొని 2019లో పెళ్లి చేసుకుంది. ఆపై బంధువుల ఇంట్లో నగలు, నగదు తీసుకు వెళుతున్న క్రమంలో గమనించి వినయ్ నిలదీయగా వినయ్ ని వదిలి వెళ్ళిపోయింది. అంతకుముందే సుహాసిని వెంకటేశ్వర రావ్ అనే మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్టు, ఆమెకు పిల్లలు కూడా ఉన్నట్టు వినయ్ కు తెలియడంతో వినయ్ పోలీస్ స్టేషన్లో సుహాసిని పై ఫిర్యాదు చేశారు.
Recommended Video
అంతకు ముందు ఇంకో పెళ్లి .. ముగ్గుర్ని పెళ్ళాడి మోసం చేసిన యువతి అరెస్ట్
ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురిని మోసం చేసి నగలు, నగదుతో నిత్య పెళ్లి కూతురుగా మారిన సుహాసినిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతకుముందు ఇలాంటి మోసాలకు పాల్పడే వారు ముఖ్యంగా అబ్బాయిలే ఉండేవారు కానీ ఇటీవల కాలంలో అమ్మాయిలు కూడా ఇలాంటి దారుణ మోసాలకు పాల్పడుతున్నారు. పెళ్లి పేరుతో మోసం చేయడం, పెళ్లిళ్లు చేసుకున్న తర్వాత మోసం చేయడం అమ్మాయిలకు నిత్యకృత్యంగా మారుతున్న పరిస్థితులు ప్రస్తుతం సమాజంలో ఆందోళనకరంగా మారాయి.