సీఎంల భేటీ: పన్నీరు వినతులు ఇవే.., తెలుగు భాష-ఎర్ర దొంగలపై బాబు
తమిళనాడు ముఖ్యమంత్రి ఓ పన్నీరు సెల్వం గురువారం మధ్యాహ్నం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు.
విజయవాడ: తమిళనాడు ముఖ్యమంత్రి ఓ పన్నీరు సెల్వం గురువారం మధ్యాహ్నం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. 14 మంది ప్రతినిధులతో కలిసి ఏపీ సీఎంను కలిశారు.
తెలుగు గంగ ద్వారా చెన్నైకి నీటి విడుదల పైన ఆయన చర్చించారు. అంతేకాకుండా, ఇతర రాజకీయ అంశాల పైన కూడా చర్చించారని తెలుస్తోంది.
ఒప్పందం ప్రకారం తెలుగు గంగ నుంచి 15 టీఎంసులు ఇవ్వాలని పన్నీరు సెల్వం విజ్ఞప్తి చేశారు. కర్నాటక, మహారాష్ట్ర, ఏపీ 5 టీఎంసీల చొప్పున ఇవ్వాలని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేసారు.
బకాయిలపై..
రూ.443 కోట్ల బకాయిలు విడుదల చేయాలని చంద్రబాబు కోరారు. శుక్రవారం కొంత మేర బకాయిలు విడుదల చేస్తామని పన్నీరు సెల్వం చెప్పారు. పొరుగు రాష్ట్రాల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలని, ఇప్పటికే ఒక టీఎంసీ నీరు విడుదల చేశామని చంద్రబాబు చెప్పారు. ఉమ్మడి ఏపీలో 5 టీఎంసీలకు ఒప్పందం చేసుకున్నామని, తెలంగాణ నుంచి రెండు టీఎంసీలు రావాలని చంద్రబాబు చెప్పారు.
ఎర్రచందనం స్మగ్లింగ్కు తమిళ కూలీలు రాకుండా అడ్డుకోవాలని, తమిళనాడులో తెలుగు భాష అమలుకు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు.
పన్నీరు సెల్వంకు గంటా స్వాగతం
గన్నవరం విమానాశ్రయం చేరుకున్న పన్నీరు సెల్వంకు మంత్రి గంటా శ్రీనివాస రావు స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబుతో భేటీ అయ్యారు.