సెంచరీ కొట్టిన టమాటా ధర; మదనపల్లి రైతులకు కాసుల పంట, సామాన్యులకు ధరల మంట!!
ఒకప్పుడు టమాటాకు గిట్టుబాటు ధర లేక రోడ్లపై టమాటాలను పారబోసి ఆందోళన వ్యక్తం చేసిన రైతన్నలు ఇప్పుడు టమాటాలను సాగు చేసినందుకు ఆనందంలో ఉన్నారు. ముఖ్యంగా మదనపల్లి టమాట రైతుకు మంచిరోజులు వచ్చాయి అని సంబరపడుతున్నారు. ఎందుకంటే చిత్తూరు జిల్లా మదనపల్లి మార్కెట్ లో మొదటి రకం టమాటా ధర ఇప్పుడు వంద రూపాయలు పలుకుతుంది. ఊహించని విధంగా టమాటా ధర సెంచరీ కొట్టటంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం తర్వాత తమ కష్టానికి ప్రతిఫలం దక్కిందని భావిస్తున్నారు. గడచిన ఐదు సంవత్సరాల్లో ఇంత ఎక్కువ ధర నమోదవడం ఇదే మొదటిసారి.
ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల కారణంగా, విపరీతంగా కురుస్తున్న వర్షాలతో టమాటా దిగుబడి పూర్తిగా తగ్గిపోవడం, అంతో ఇంతో వస్తున్న పంట కూడా వర్షం కారణంగా తెగుళ్లతో నాణ్యత లేకపోవడం, ఇక టమాటా డ్యామేజ్ ఎక్కువగా ఏర్పడడం వంటి కారణాలు వెరసి మార్కెట్లో డిమాండ్ కు తగ్గట్టుగా టమాటా రాకపోవడంతో ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అంతేకాదు టమాటాను సాగు చేసే ఇతర రాష్ట్రాలలో కూడా వర్షాల కారణంగా పంటకు నష్టం వాటిల్లింది. దీంతో దేశ వ్యాప్తంగా దిగుబడి బాగా తగ్గింది. దీంతో వ్యాపారులు ఇప్పుడు మదనపల్లి మార్కెట్ పై దృష్టి సారించారు.
మదనపల్లి రైతులు సంవత్సరం అంటా టమాటా సాగు చేస్తారు. అయినప్పటికీ ప్రస్తుతం ఇక్కడ మార్కెట్ లో అన్ సీజన్ కావడం, దిగుబడి ఆశించిన స్థాయిలో లేకపోవడం, డిమాండ్ కు తగినంతగా పంట లేకపోవడంతో రికార్డు స్థాయిలో ధర నమోదయింది. దీంతో ఇప్పుడు టమాటాలను మార్కెట్లో బంగారంగా భావిస్తున్న పరిస్థితి ఉంది. 2016 సంవత్సరం నవంబర్ నెలలో మొదటి రకం టమాటా అత్యధికంగా 98 రూపాయలు ధర పలకగా, మళ్లీ ఇంత కాలం తర్వాత ఇప్పుడు మదనపల్లె మార్కెట్లో టమాట ధర 100 రూపాయలుగా నమోదయింది.
టమాటా ధర సెంచరీ కొట్టడంతో మదనపల్లి టమాటా రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ నష్టాలతో ఇబ్బంది పడే రైతులకు ఈ సారి టమాట పంట కాసుల వర్షం కురిపిస్తుంది. అయితే టమాటాలను కొనుగోలు చేయాలనుకుంటున్న సామాన్యులకు మాత్రం ఈ ధర పెనుభారంగా మారింది. నిత్యం తమ వంటకాల్లో తప్పని సరిగా భావించే టమాటా కొనుగోలు చెయ్యాలంటేనే భయపడే స్థాయిలో ధరలు పెరగటం సామాన్యులకు ఆందోళన కలిగిస్తుంది.