మద్యం షాపుల టెండర్లకు రేపే ఆఖరు తేదీ.. ఆలసించిన ఆశాభంగం!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన మద్యం పాలసీలో భాగంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం షాపులను రద్దుచేసి ప్రైవేట్ వారికి మద్యం షాపుల లైసెన్సులు ఇచ్చేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ క్రమంలో మద్యం దుకాణాల కోసం నిన్న రాత్రి 9గంటల వరకు 20,310 దరఖాస్తులు వచ్చాయి. అయితే మద్యం షాపుల దరఖాస్తులకు బుధవారం ఆఖరి రోజు కావడంతో నేడు, రేపు వేలసంఖ్యలో దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు.
మద్యం షాపుల టెండర్ల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం
ఇక మద్యం టెండర్లకు దరఖాస్తులకు గడువు దగ్గర పడడంతో సోమవారం ఒక్కరోజే 12,036 అర్జీలు వచ్చినట్టుగా అధికారులు వెల్లడించారు. మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3396 మద్యం షాపులకు లైసెన్సులు ఇచ్చేందుకు నోటిఫికేషన్ ఇవ్వగా మొత్తం ఏడు రోజుల వ్యవధిలో 20,000 పైచిలుకు దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటివరకు నాన్ రిఫండబుల్ రుసుముల రూపంలో ఏపీ ప్రభుత్వానికి 406.20 కోట్ల రూపాయల ఆదాయం మద్యం షాపుల దరఖాస్తులపైన సమకూరింది.

ఏపీలో ఈ జిల్లాలోనే అత్యధికంగా దరఖాస్తులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల లైసెన్సులకు సగటున ఒక్కో షాపుకు ఆరు చొప్పున దరఖాస్తులు వచ్చినట్టుగా తెలుస్తుంది. కొన్ని జిల్లాలలో మద్యం షాపుల దరఖాస్తులకు తీవ్రమైన పోటీ నెలకొంది. ఏపీలోని విజయనగరం జిల్లాలో 153 దుకాణాలు నోటిఫై చేయగా అక్కడ 1689 దరఖాస్తులు ఇప్పటి వరకు వచ్చాయి. ఏపీలో ఈ జిల్లాలోనే అత్యధికంగా మద్యం షాపులకు దరఖాస్తులు వచ్చాయి.
జిల్లాలలో మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఇలా
ఏలూరులో 144 దుకాణాలకు కాను 1488 దరఖాస్తులు రాగా, శ్రీకాకుళంలో 158 దుకాణాలకు 1003 దరఖాస్తులు వచ్చాయి. పశ్చిమగోదావరి జిల్లాలో 175 మద్యం షాపులకు 1127, ఎన్టీఆర్ జిల్లాలో 113 మద్యం షాపులకు 1519 దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం. ఇక ఈనెల 11వ తేదీన మద్యం దుకాణాలకు వేలం పాట నిర్వహించేందుకు ఎక్సైజ్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది.
ఆఫ్ లైన్ లో దరఖాస్తులకు ఇలా చెయ్యండి
పట్టణాలలో మద్యం దుకాణాల కోసం దరఖాస్తులు బానే ఉన్నా గ్రామీణ ప్రాంతాలలో దుకాణాల కోసం దరఖాస్తులు చేసుకునే వారి సంఖ్య తక్కువగా ఉందని అధికారులు భావిస్తున్నారు. మద్యం దుకాణాల లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకునేవారు ఆన్లైన్ విధానంలోనే కాక ఆఫ్లైన్ విధానంలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఎక్సైజ్ స్టేషన్లో సంప్రదించాలని అధికారులు చెబుతున్నారు.
రుసుము చెల్లింపులు ఈజీగానే
ఇక మద్యం షాపుల కోసం చెల్లించే నాన్ రిఫండబుల్ రుసుము రెండు లక్షల రూపాయలకు సంబంధించి దేశంలోని ఏ వాణిజ్య బ్యాంకులో తీసిన డిమాండ్ డ్రాఫ్ట్ అయినా అంగీకరిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇక గ్రామీణ బ్యాంకుల్లో డీడీలు తీసేవారు అవి రాష్ట్ర పరిధిలోని బ్యాంకులే అయి ఉండాలని కూడా స్పష్టం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications