Kurnool: రాజధాని ఒకచోట..హైకోర్టు మరోచోట: ఆ 14 రాష్ట్రాల జాబితాలో ఏపీ కూడా..!
కర్నూలు: రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రాంతాలైన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల అభివృద్ధిలో భాగంగా..ఈ రెండు ప్రాంతాల్లో రెండు రాజధానులను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిండుసభలో చేసిన ప్రకటన పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. రాజధాని అమరావతి ప్రాంత రైతులు దీన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ.. అటు రాయలసీమ, ఇటు ఉత్తరాంధ్ర జిల్లాల వాసులు ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ, లోక్ సత్తా సైతం ముఖ్యమంత్రి నిర్ణయానికి అనుకూలంగా స్పందించాయి.
కర్నూలుకే హైకోర్టు..
కర్నూలులో శాశ్వత హైకోర్టు ఏర్పాటు కాబోతోందనే విషయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన ప్రకటనతో స్పష్టమైంది. హైకోర్టు సహా.. న్యాయపరమైన అన్ని రకాల వ్యవహారాలు, ఇతరత్రా కార్యకలాపాలకు కూడా కర్నూలు కేంద్ర బిందువుగా మారుతుంది. హైకోర్టుకు రావాలంటే ఉత్తరాంధ్ర వాసులు ఇబ్బందులకు గురవుతారనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్న నేపథ్యంలో.. విశాఖలోనూ ఓ బెంచ్ ను ఏర్పాటు చేసే అవకాశాన్ని జగన్ సర్కార్ పరిశీలించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.

రాజధాని ఒక చోట.. హైకోర్టు మరో చోట
నిజానికి- రాజధాని ఒక చోట.. హైకోర్టు మరో చోట ఉండటం కొత్తేమీ కాదు. ఇప్పటికే మొత్తం 14 రాష్ట్రాల్లో ఈ తరహా న్యాయ పరిపాలన కొనసాగుతోంది. అలహాబాద్ (లక్నో-ఉత్తర్ ప్రదేశ్), భిలాస్ పూర్ (రాయ్ పూర్-ఛత్తీస్ గఢ్), అహ్మదాబాద్ (గాంధీనగర్-గుజరాత్), కొచ్చి (తిరువనంతపురం-కేరళ), కొచ్చి (కవరట్టి-లక్షద్వీప్), జబల్ పూర్ (భోపాల్-మధ్య ప్రదేశ్), కటక్ (భువనేశ్వర్-ఒడిశా), జోధ్ పూర్ (జైపూర్-రాజస్థాన్), నైనిటాల్ (డెహ్రాడూన్-ఉత్తరాఖండ్), ముంబై (పనాజి-గోవా)లల్లో ఆయా రాష్ట్రాల హైకోర్టులు కొనసాగుతున్నాయి. ఇక ఒక్క గువాహతిలోనే మూడు రాష్ట్రాల హైకోర్టులు ఏర్పాటు కావడం ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ విషయం. అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, నాగాలాండ్ రాష్ట్రాల హైకోర్టులు అస్సాంలోని గువాహతిలో ఏర్పాటు అయ్యాయి. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి హైకోర్టు చెన్నైలో ఏర్పాటైంది.












Click it and Unblock the Notifications