స్పీడీ రికవరీ: ఏపీలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య ఎంతో తెలుసా?: రికార్డు స్థాయిలో
అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఇదివరకు నమోదైన కేసులతో పోల్చుకుంటే.. రోజువారీ కేసుల సంఖ్య తగ్గిందే తప్ప పూర్తిగా నియంత్రణలోకి రావట్లేదు. సోమవారం విడుదలైన బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం 6,780 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 2,96,609కు చేరుకుంది. కొత్తగా తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఒక్కరోజే 911 కేసులు నమోదు అయ్యాయి.

రెండు లక్షలను దాటిన రికవరీలు..
సోమవారం నాటి బులెటిన్ ప్రకారం.. 24 గంటల వ్యవధిలో మొత్తం 44,578 నమూనాలను పరీక్షించగా 6780 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. అదే సమయంలో రికవరీ సంఖ్య భారీగా నమోదవుతోంది. ఇప్పటిదాకా రాష్ట్రంలో రెండు లక్షలమందికి పైగా కరోనా పేషెంట్లు కోలుకున్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఇళ్లకు వెళ్లిపోయారు. మొత్తం 2,09,100 మంది డిశ్చార్జి అయ్యారు. మహారాష్ట్ర సహా మరి కొన్ని రాష్ట్రాల్లో కూడా రికవరీ రేటు రెండు లక్షలను దాటుకున్నప్పటికీ.. వేగంగా ఈ మార్క్ను అందుకున్న రాష్ట్రంగా ఏపీ నిలిచింది.

పౌష్టికాహారం.. నాణ్యమైన చికిత్స..
కరోనా వైరస్ పేషెంట్లకు నాణ్యమైన చికిత్స, ఆహారాన్ని అందిస్తున్నందు వల్లే రికార్డు సమయంలో రెండు లక్షల మార్క్ను అందుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. కరోనా పేషెంట్లకు నాణ్యమైన, పౌష్టిక ఆహారాన్ని అందించడానికి రోజూ మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తోందని వెల్లడించారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీలోనే రికవరీ రేటు వేగంగా పెరుగుతోందని తెలిపారు.

కర్నూలు, తూర్పు గోదావరి జిల్లాల్లో
అత్యధికంగా కర్నూలులో డిశ్చార్జి అయిన పేషెంట్ల సంఖ్య అధికంగా నమోదైంది. ఈ జిల్లాలో ఇప్పటిదాకా 26,407 మంది డిశ్చార్జి అయ్యారు. తూర్పు గోదావరి జిల్లా రెండో స్థాయిలో నిలిచింది. ఇక్కడ 26,049 మంది ఇప్పటిదాకా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. డిశ్చార్జి అయిన వారిలో 2895 మంది పొరుగు రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి స్వస్థలానికి చేరుకుని కరోనా వైరస్ బారిన పడిన వారిలో 2461 మంది. ఇతర దేశాల నుంచి స్వస్థలానికి వచ్చిన వారిలో 434 మంది కోలుకున్నారు.

జిల్లాలవారీగా రికవరీలు..
జిల్లాలవారీగా అనంతపురం-24,300, చిత్తూరు-14,673, గుంటూరు-18,938, కడప-12,679, కృష్ణా-9208, నెల్లూరు-12,334, ప్రకాశం-7351, శ్రీకాకుళం-9830, విశాఖపట్నం-19,524, విజయనగరం-6222, పశ్చిమ గోదావరి-18,690 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 84,777 మంది పేషెంట్లు కరోనా కోరల్లోనే ఉన్నారు. వారంతా వేర్వేరు ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్లు, ఐసొలేషన్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారు. హోమ్ ఐసొలేషన్లలో ఉంటోన్న వారి కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా కరోనా కిట్లను అందిస్తోంది. గ్రామ/వార్డు వలంటీర్ల ద్వారా కరోనా కిట్లను హోమ్ ఐసొలేషన్లో ఉన్న వారి కోసం సరఫరా చేస్తోంది.
Recommended Video

2732 మంది మృతి
కరోనా వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య కూడా ఏపీలో భారీగా నమోదవుతోంది. ఇప్పటిదాకా 2732 మంది మరణించారు. అత్యధిక మరణాలు కర్నూలు, గుంటూరు జిల్లాల్లో నమోదు అయ్యాయి. ఈ రెండు జిల్లాల్లో 297 మంది చొప్పున మృతి చెందారు. అనంతపురం-229, చిత్తూరు-243, తూర్పు గోదావరి-286, కడప-124, కృష్ణా-229, నెల్లూరు-148, ప్రకాశం-174, శ్రీకాకుళం-171, విశాఖపట్నం-211, విజయనగరం-121, పశ్చిమ గోదావరి-202 మంది మరణించారు.












Click it and Unblock the Notifications