ఫైరింగ్ ప్రాక్టీస్: ట్రైనీ ఐపీఎస్ అధికారికి గాయాలు
హైదరాబాద్: శిక్షణలో భాగంగా రంగారెడ్డి జిల్లా వికారాబాద్ సమీపంలోని అనంతగిరి కొండల్లో ఫైరింగ్ ప్రాక్టీస్లో అపశృతి చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తూ గన్ తలకు తగలడంతో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఆనంద్ కులకర్ణికి తీవ్ర గాయాలయ్యాయి. అతని తలకు రైఫిల్ బట్ తాకింది.
అతనిని వెంటనే స్థానిక వికారాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆయనను హైదరాబాద్ తరలించారు. సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ రాజకుమారి పరిశీలించారు. ఎన్పీఏ ఆధ్వర్యంలో ఈ ఫైరింగ్ ప్రాక్టీస్ జరుగుతోంది.

17వ రోజుకు చేరిన జూడాల సమ్మె
తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మె 17వ రోజుకు చేరుకుంది. గురువారం ఉదయం ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల ఎదుట జూడాలు ఆందోళనకు దిగారు. అత్యవసర సేవలను బహిష్కరించిన నిరసన వ్యక్తం చేశారు. దీంతో వైద్య సేవలు నిలిచిపోవడంతో రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దొంగల ముఠా అరెస్ట్
చోరీలకు పాల్పడుతున్న ఆరుగురు సభ్యుల దొంగల ముఠాను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. దొంగల నుండి రూ.27 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆగస్టు నెలలో ఈ దొంగల ముఠా కోటి బస్టండు వద్ద దోపిడీకి పాల్పడిందని పోలీసులు గుర్తించారు.
11 మంది ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్
చిత్తూరు జిల్లా నగరిలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు అక్రమంగా చెన్నైకి తరలిస్తున్న 31 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన తొమ్మిది మంది స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. వారు ప్రయాణిస్తున్న రెండు కార్లను కూడా సీజ్ చేశారు. స్మగ్లర్లపై కేసు నమోదు చేశారు. పుత్తూరులో కూడా 25 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేసి, రెండు కార్లను సీజ్ చేశారు.












Click it and Unblock the Notifications