కేంద్రం పక్కా ట్రాప్- రెచ్చగొట్టి ఇరుకున్న జగన్- మరో లాబీయింగ్ కు పాట్లు?
ఆంధ్రప్రదేశ్ కు విభజన సందర్భంగా ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోవడంలో విఫలమవుతున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా తన నిర్ణయాలతో మరిన్ని కొత్త సమస్యలకు కారణమవుతోంది. అయితే ఈ సమస్యలపై మౌనంగా ఉంటున్న కేంద్రాన్ని రెచ్చగొట్టడం ద్వారా సమస్య తీవ్రతను ఏపీ మరింత పెంచుకుంది. ఇప్పుడు కేంద్రం తీసుకున్న కీలక నిర్ణయంతో విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి మరిన్ని కష్టాలు తప్పేలా లేవు. దీంతో ఇప్పుడు కేంద్రాన్ని ఎందుకు కెలికామా అని ఏపీలోని జగన్ సర్కార్ మథన పడుతోంది.
విభజన సమస్యలపై కేంద్రం మౌనం
ఏపీ విభజన సందర్భంగా రాష్ట్రానికి ఇచ్చిన హామీల్ని నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. విభఙజన జరిగి ఏడేళ్లు పూర్తవుతున్నా ప్రత్యేక హోదాతో పాటు ఏ ఒక్క చెప్పుకోదగ్గ సమస్యకూ ఇప్పటికీ పరిష్కారం లభించలేదు. దీంతో ఇప్పటికే జనంలో అసంతృప్తి పతాక స్ధాయిలో ఉంది. ఇలాంటి సమయంలో అనూహ్యంగా కొత్త సమస్యలు తెరపైకి వస్తున్నాయి. వీటిని పరిష్కరించే విషయంలో మరోసారి ఏపీ సర్కార్ కేంద్రాన్ని ఆశ్రయించక తప్పని పరిస్దితి.
కేంద్రాన్ని జగన్ రెచ్చగొట్టారా?
విభజన సమస్యల్లో ఒకటైన నీటి పంపకాల వ్యవహారంలో తాజాగా తెలంగాణతో చోటు చేసుకున్న వివాదం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదనే కారణంతో జగన్ వరుస లేఖలు రాశారు. ప్రధాని, జల్ శక్తి మంత్రి, పర్యావరణ మంత్రి, కృష్ణా రివర్ బోర్డు.. ఇలా ప్రతీ ఒక్కరికీ ఏపీకి జరుగుతున్న అన్యాయంపై లేఖలు రాశారు. అయితే అంతర్ రాష్ట్ర జల వివాదంపై కేంద్రం అప్పటికే .సంయమనం పాటిస్తోంది. ఇలాంటి సమయంలో జగన్ రాసిన లేఖలు వారికి ఆగ్రహం తెప్పించినట్లు తెలుస్తోంది. ఏదో ఒక నిర్ణయం తీసుకునేలా కేంద్రాన్ని జగన్ రెచ్చగొట్టినట్లు అర్ధమవుతోంది.
కేంద్రం ట్రాప్ లో జగన్?
విభజన తర్వాత ఏర్పాటు కావాల్సిన కృష్ణా, గోదావరి రివర్ బోర్డులు ఏడేళ్ల తర్వాత కూడా ఏర్పాటు కాకపోవడంతో కేంద్ర ప్రభుత్వాన్ని జగన్ ప్రశ్నించారు. రివర్ బోర్డుల ఏర్పాటుతో ఏపీ, తెలంగాణలో ప్రధానమైన ప్రాజెక్టుల్ని ఇందులో చేరుస్తారని ఆశించారు. కానీ కేంద్రం మాత్రం కృష్ణా, గోదావరి నదిపై ఉన్న ప్రతీ ప్రాజెక్టును బోర్డుల పరిధిలోకి తీసుకొచ్చేసింది. ఇప్పుడు కాలవలకూ మినహాయింపు లేదు. అంటే కృష్ణా, గోదావరి జలాలు వాడుకునే చివరి రాష్ట్రంగా ఉన్నప్పటికీ ప్రతీ కాలవలో పారే నీటికీ ఇప్పుడు ఆయా బోర్డులకు ఏపీ లెక్క చెప్పాల్సిన పరిస్ధితి వచ్చింది. దీంతో జగన్ కేంద్రం ట్రాప్ లో పడినట్లయింది.
గెజిట్ లో మార్పులకు కేంద్రం అంగీకరిస్తుందా?
కేంద్రం ఏపీలో ఉన్న, కొత్తగా నిర్మిస్తున్న ప్రాజెక్టులన్నింటినీ బోర్డుల పరిధిలోకి తీసుకురావడంతో ఇరుకున పడిన జగన్ సర్కార్.. ఇప్పుడు దీనిపై లాబీయింగ్ మొదలుపెట్టాలని భావిస్తోంది. రివర్ బోర్డుల పరిధిలోకి అన్ని ప్రాజెక్టులు, కాల్వలు తీసుకురావడం ద్వారా తమకు విభజన వాటాగా వచ్చిన నీటిపైనా బోర్డులకు జవాబుదారీగా ఉండాల్సిన పరిస్ధితి ఏర్పడిందని జగన్ సర్కార్ భావిస్తోంది. దీంతో త్వరలో కేంద్రాన్ని తాజాగా గెజిట్ లో మార్పులు చేయాలని కోరబోతోంది. అయితే గెజిట్ ను పార్లమెంటులో పెట్టే బిల్లుల కంటే పకడ్బందీగా తయారు చేశామన్న కేంద్రం ప్రకటన ఏపీ సర్కార్ లో గుబులు రేపుతోంది.