బీజేపీ యూటర్న్-జగన్, చంద్రబాబుకు సంకటం-కాదని మోడీ ముందుకెళ్తారా ?
తాజాగా జరిగిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఏపీలో ఏమాత్రం బీజేపీకి బలం లేదని భావిస్తున్న వారికి షాకిచ్చాయి. బీజేపీకి ఒక్క సీటు, ఓటు లేకపోయినా ఈ రెండు ఎన్నికల్లో రాష్ట్రంలో అన్ని ఓట్లు వేయించుకోవడంలో సక్సెస్ అయింది. దీంతో రాష్ట్రంలో అధికార, విపక్ష పార్టీలైన వైసీపీ, బీజేపీ కేంద్రంలో బీజేపీకి ఏ స్ధాయిలో మద్దతిస్తున్నాయో తేలిపోయింది. అయితే మరో విషయంలో ఇప్పుడు కేంద్రానికి ఈ రెండు పార్టీల మద్దతు అవసరమొచ్చేలా ఉంది. మరి అప్పుడు ఈ రెండు పార్టీలు ఎలా స్పందిస్తాయన్న దానిపై చర్చ మొదలైంది.

బీజేపీకి వైసీపీ, టీడీపీ మద్దతు
ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ, విపక్షం ఉన్న టీడీపీ కేంద్రంలో బీజేపీకి పోటాపోటీగా మద్దతిస్తున్నాయి. బీజేపీ సాయం లేకుంటే ఏపీలో ఏమీ చేయలేమనే అంచనాకు ఈ రెండు పార్టీలు వచ్చేయడమే ఇందుకు కారణం. అంతకు మించి బీజేపీని వ్యతిరేకిస్తే ఏం జరుగుతుందో ఈ రెండు పార్టీల అధినేతలు వైఎస్, చంద్రబాబుకు బాగా తెలుసు. అందుకే బీజేపీ వీరిద్దరినీ ఓ రేంజ్ లో వాడుకుంటోంది. అయినా ఈ అనివార్య పరిస్ధితిపై నోరు మెదపలేని పరిస్ధితుల్లోకి జగన్, చంద్రబాబు జారిపోయారు.

పథకాలపై వైసీపీ, టీడీపీ
రాష్ట్రంలో అమలుచేస్తున్న సంక్షేమ పథకాలపై వైసీపీ, టీడీపీ ఇద్దరికీ భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ .. స్ధూలంగా చూస్తే ఇవి తప్పనిసరని ఇరు పార్టీల అధినేతలు జగన్, చంద్రబాబు భావిస్తున్నారు. అంతే కాదు చంద్రబాబు అమలుచేసిన వాటి కంటే ఎక్కువగా తాను సంక్షేమ పథకాలు అమలు చేయడం ద్వారా ఇందులో ఛాంపియన్ గా నిలిచేందుకు సైతం జగన్ ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం భారీ స్ధాయిలో అప్పులు చేసేందుకు కూడా వెనుకాడటం లేదు. దీంతో చంద్రబాబు కూడా వీటిని అనుకూల మీడియాలో, కోర్టుల్లో కౌంటర్ చేస్తూ చికాకు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఏపీలో పథకాల వ్యవహారం జాతీయస్ధాయిలో కూడా చర్చనీయాంశంగా మారుతోంది.

ఉచితాలపై బీజేపీ యూటర్న్
ఉచిత పథకాల విషయంలో కేంద్రంలో ఉన్న బీజేపీ తాజాగా యూటర్న్ తీసుకున్నట్లు కనబడుతోంది. గతంలో తాను అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో భారీ ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేసిన బీజేపీ.. ఇప్పుడు సుప్రీంకోర్టు జోక్యంతో ఉచితాల్ని కత్తిరించే విషయంలో సానుకూలంగా నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. అవసరమైతే సుప్రీంకోర్టు సూచనల ప్రకారం పార్లమెంటులో ఓ బిల్లు పెట్టినా ఆశ్చర్యం లేదు. దీంతో ఉచిత పథకాల విషయంలో ఉరుముతున్న సుప్రీంకోర్టును శాంతింపజేయడంతో పాటు ప్రభుత్వాలపై ఆర్దిక భారం తగ్గించేందుకు బీజేపీ ప్రయత్నించవచ్చన్న సంకేతాలు వెలువడుతున్నాయి. దీంతో ఏపీలో వైసీపీ, టీడీపీలకు ఇది సంకటంగా మారింది.
Recommended Video


వైసీపీ, టీడీపీలకు సంకటం ?
ఇప్పటివరకూ బీజేపీకి అన్నివిషయాల్లోనూ అండగా నిలిచేందుకు బేషరతుగా సిద్ధమైపోతున్న వైసీపీ, టీడీపీకి ఈసారి ఉచితాల పంపిణీ విషయంలో మాత్రం ఆ పరిస్ధితి కనిపించడం లేదు. ఏపీలో ఉచితాలకు ప్రజల్ని అలవాటు చేసిన ఈ రెండు పార్టీలు ఇప్పుడు వాటిని వ్యతిరేకించే పరిస్ధితి లేదు. అలాగని బీజేపీని వ్యతిరేకించి మోడీ ఆగ్రహానికి గురయ్యే పరిస్దితులూ లేవు. దీంతో ఇప్పుడు ఉచిత పథకాలకు కేంద్రం కత్తెర వేయాలనుకుంటే మాత్రం వైసీపీ, టీడీపీల పరిస్దితి ముందునుయ్యి, వెనుక గొయ్యిగా మారడం ఖాయం. అప్పుడు కేంద్రానికి మద్దతుపై ఈ రెండు పార్టీల వైఖరి కీలకంగా మారనుంది. ప్రస్తుతానికి జగన్, చంద్రబాబు మౌనం పాటిస్తున్నా దీనిపై ఏదో ఒక దశలో మాట్లాడక తప్పేలా లేదు.












Click it and Unblock the Notifications