బాబును ఇరికించాలని: రాజప్ప, ఏసీబీ లేదంటే తెరాస ఉందంటోంది, కుట్రనే
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు స్టీఫెన్ సన్ను ఎరగా వేసి తమ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని ఇరికించారని ఏపీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప రాజమండ్రిలో అన్నారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు.
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును ఫోన్ ట్యాపింగ్ చేశామని చెబుతున్నారని, దీని పైన తాము కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు. తెరాస నేతలకు దమ్ముంటే చంద్రబాబు మాట్లాడినట్లు చెబుతున్న ఆడియో టేపులను బయటపెట్టాలన్నారు.
స్టింగ్ ఆపరేషన్, స్టీఫెన్ సన్ పైన కేసు పెట్టాలన్నారు. కుట్ర ద్వారా చంద్రబాబును ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్, వైయస్ జగన్లు కుమ్మక్కై కుట్ర రాజకీయాలకు తెరదీశారన్నారు. రేవంత్ పైన జరిగిన కుట్రలో కేసీఆర్ పాత్ర ఉందని ఆరోపించారు. రేవంత్ పైన జరిగిన కుట్రలో ఏసీబీ ప్రమేయం లేదన్నారు.
రేవంత్ కేసులో దర్యాఫఅతు కొనసాగుతున్న తీరుపై తెలంగాణ టీడీపీ నేత రావుల చంద్రశేఖర రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ మంత్రులే దర్యాఫ్తు చేస్తున్నట్లుగా ఉందన్నారు. ఓ వైపు రేవంత్ రెడ్డికి సంబంధఇంచిన టేపులు తాము ఎవరికీ ఇవ్వలేదని ఏసీబీ డీజీ ఏకే ఖాన్ చెబుతుంటే, మరోవైపు రేవంత్కు సంబంధించిన ఫుటేజ్ మొత్తం తమ వద్ద ఉందని తెరాస నేతలు ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు.
దర్యాఫ్తు చేస్తోంది అధికారులా లేక మంత్రులా అన్న సందేహం వస్తోందన్నారు. కుట్రలతో రేవంత్ రెడ్డిని ఇరికించారని, మరి టీడీపీ ఎమ్మెల్యేలను తెరాసలో చేర్చుకున్న కేసీఆర్ మొదటి ముద్దాయి కాదా అని ప్రశ్నించారు. ఆయన పైన ముందుగా కేసు పెట్టాలన్నారు.