పుతిన్ కోసమే.. ఉక్రెయిన్ కోసం కాదు..! చర్చలకు ముందే ట్రంప్ షాక్..!
సుదీర్ఘంగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్దం ఆపేందుకు రంగంలోకి దిగినట్లు బిల్డప్ ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అలస్కాలో పుతిన్ తో చర్చలకు ముందే అసలు విషయం బయటపెట్టేశారు. అలస్కాలో చర్చలకు బయలుదేరే ముందు విమానంలో మీడియాతో మాట్లాడిన ట్రంప్.. ఉక్రెయిన్ కు షాకిచ్చారు. దీంతో కొన్ని రోజులుగా ఈ చర్చలపై వస్తున్న ఊహాగానాలన్నింటికీ ఆయన చెక్ పెట్టేశారు.
ఉక్రెయిన్ యుద్దం సుదీర్ఘంగా కొనసాగడం వెనుక భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలు రష్యాకు మద్దతుగా ఉన్నాయని భావిస్తున్న ట్రంప్.. ఆయా దేశాలపై ఇప్పటికే సుంకాలు పెంచేశారు. అలాగే రష్యా చమురు కొంటున్నందుకు భారీ పెనాల్టీలు కూడా విధిస్తున్నారు. దీంతో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇవాళ అలస్కాలో ట్రంప్ తో చర్చలకు అంగీకరించారు. దీనిపై ట్రంప్ స్పందిస్తూ అలస్కా చర్చల లక్ష్యం పుతిన్ ను రప్పించడమే కానీ ఉక్రెయిన్ తరఫు ఒప్పందాలు చేసుకోవడం కాదన్నారు.

తన లక్ష్యం ఉక్రెయిన్ లో యుద్దం ఆపడమేనని, ఇందుకు రష్యా ఒప్పుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని ట్రంప్ తేల్చిచెప్పేశారు. రష్యా ఆర్ధిక వ్యవస్థ, ఆ దేశం యుద్ధం చేయాల్సిన ఆవశ్యకతపై ఇవాళ చర్చల్లో సానుకూల ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. పుతిన్ ఇవాళ చర్చలకు రష్యా వ్యాపారవేత్తల్ని తీసుకుని రావడంపై స్పందిస్తూ ఉక్రెయిన్ లో యుద్దం ముగిసేవరకూ ఒప్పందాలు చేసుకునే పరిస్ధితి లేదన్నారు.

2022లో ఉక్రెయిన్ పై యుద్దం మొదలుపెట్టాక పుతిన్ అమెరికాలో పర్యటించడం ఇదే మొదటిసారి. తాజాగా ట్రంప్ తన మిత్రదేశాలపై సుంకాలతో టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో పుతిన్ ఈ చర్చలు కోరారు. దీంతో అంగీకరించిన ట్రంప్.. ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు చర్చలు జరిపేందుకు సిద్దమని ప్రకటించారు. ఇవాళ చర్చల్లో వెలువడే ఫలితాన్ని బట్టి రష్యా ఉక్రెయిన్ యుద్దం ఆగడంతో పాటు పలు కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications