TTD: భక్తులుగా మారువేషాల్లో టీటీడీ ఉద్యోగులు.. ఎందుకంటే
కలియుగ ప్రత్యక్ష దైవం, ఏడు కొండలపై కొలువుదీరిన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటానికి దేశ విదేశాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. ప్రపంచంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా పేరు గాంచిన తిరుమలలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పాలన గాడి తప్పిందని ప్రస్తుతం తిరుమలను ప్రక్షాళన చేసే పనిలో పడ్డారు.
తిరుమల ప్రక్షాళనపై ఈవో ఫోకస్
ఇప్పటికే తిరుమల ఈవోగా టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత నియామకం అయిన జే శ్యామలా రావు తిరుమలలో దళారీ వ్యవస్థ నిర్మూలన కోసం కీలక ఆదేశాలిచ్చారు. తిరుమలలో దళారులను ఏరి వెయ్యాలని ఆదేశించారు. టీటీడీ ఆన్లైన్ అప్లికేషన్లకు ఆధార్ అనుసంధానం ద్వారా దళారీ వ్యవస్థ నియంత్రణ జరుగుతుందని టీటీడీ ఈవో జె.శ్యామలరావు పేర్కొన్నారు. ఈ మేరకు పని మొదలు పెట్టారు.

తిరుమలలో ప్రతీ విభాగంలోనూ సంచలన నిర్ణయాలు
అంతేకాదు తిరుమలలో పారిశుద్ధ్య ప్రమాణాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పిన టీటీడీ ఈవో, పారిశుధ్యంపై సీనియర్ అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసి తిరుమలలో పారిశుధ్య నిర్వహణకు పెద్ద పీట వేశారు. తిరుమలలో వసతి గదుల నిర్వహణతో పాటు, వసతి గదుల కేటాయింపుపైన కూడా ఈవో దృష్టి సారించారు. శ్రీవారి లడ్డు నాణ్యత మరింత పెంచడానికి చర్యలు చేపట్టినట్టు ప్రకటించారు.
టీటీడీ నిర్ణయించిన ధరలకే వస్తువులను విక్రయించాలి
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం విచ్చేసే భక్తులకు టీటీడీ నిర్ణయించిన ధరలకే వస్తువులను దుకాణదారులు విక్రయించాలని తాజాగా అధికారులను ఆ విధంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. అధిక ధరలు విక్రయిస్తే చట్టపరంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ ఈరోజు ఒక ప్రకటనలో తెలియజేసింది.
శ్రీవారి మెట్టు వద్ద తనిఖీలు.. అందుకే
టీటీడీ ఈవో ఆదేశాల మేరకు జేఈఓ వీరబ్రహ్మం పర్యవేక్షణలో శనివారం టీటీడీ ఉద్యోగులు భక్తుల వలె శ్రీవారి మెట్టు వద్ద తనిఖీలు చేసి అధిక ధరలకు వస్తువులను విక్రయిస్తున్నట్లు నిర్ధారించారు. భక్తులను ఇబ్బందులు గురి చేసేలా అధిక ధరలకు విక్రయించినట్లు మరోసారి తమ దృష్టికి వస్తే అలాంటి షాపులను సీజ్ చేస్తామని టీటీడీ జెఇఓ వీరబ్రహ్మం ఆ ప్రకటన ద్వారా హెచ్చరించారు.












Click it and Unblock the Notifications