TTD: తిరుమలలో బ్రోకర్ల ఏరివేత, ఈవో ఆదేశాలు, తిరుపతిలో మీటింగ్, ఆ కేసుల్లో !
తిరుమల శ్రీవారి భక్తులను మోసగిస్తున్న దళారులను కనిపెట్టి ఎప్పటికప్పుడు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా టీటీడీ ఈవో జే.శ్యామలరావు తిరుపతి జిల్లా ఎస్పీని కోరారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో బుధవారం తిరుపతి జిల్లా పోలీస్, టీటీడీ నిఘా మరియు భద్రత విభాగం అధికారులతో ఈవో జే శ్యామలరావు సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో జే. శ్యామలరావు మాట్లాడుతూ తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే వేలాది మంది భక్తులకు అవసరమైన వసతి, దర్శనం, ఆర్ధితసేవ టికెట్లకు సంబంధించి భక్తులను మోసగిస్తున్న అనేకమంది దళారులను ఉపేక్షించరాదన్నారు. వారిపై వెంట వెంటనే చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో జే. శ్యామలరావు సంబంధిత అధికారులను ఆదేశించారు.

సీవీఎస్ఓ వివరించిన ఆవశ్యకత మేరకు తిరుమలలో ఐటీ అనుబంధంగా ఉన్న కేసులను సత్వరం పరిష్కరించేందుకు సైబర్ క్రైమ్ టీం ఏర్పాటు పరిశీలించవలసిందిగా సంబంధిత అధికారులకు ఈవో జే శ్యామలరావు సూచించారు. అంతకుముందు పోలీస్ విభాగం అధికారులు తిరుమలలో దర్శన దళారులకు సంబంధించి, ఆన్ లైన్ ద్వారా, డిప్ సిస్టం ద్వారా, రిజిస్ట్రేషన్ చేసుకున్న కేసులు, దొంగతనం కేసులు, మధ్యపానం, నకిలీ వెబ్ సైట్లు తదితర అంశాలకు సంబంధించిన కేసులు ఏఏ దశల్లో ఉన్నాయో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈవో శ్యామలరావుకు వివరించారు.
అనంతరం టీటీడీ ఈవో శ్యామలరావు మాట్లాడుతూ మరో వారంలోపు ఈ కేసుల్లో ఉన్న దళారులకు చట్టపరంగా తగు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ అధికారులను కోరారు. అంతేకాకుండా ఇటువంటి కేసుల సత్వర పరిష్కారం కోసం టీటీడీ విజిలెన్స్, పోలీస్ విభాగాలు తరచూ సమావేశం కావాలన్నారు. ఈ సమావేశంలో తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, టీటీడీ జేఈవోలు శ్రీమతి గౌతమి, వీరబ్రహ్మం, సీవీ అండ్ ఎస్ఓ నరసింహ కిషోర్, తిరుమల అదనపు ఎస్పీ శ్రీమతి విమల కుమారి, డీఎస్పీ శ్రీనివాస ఆచారి, టీటీడీ వీజీవో (విజిలెన్స్) గిరిధర్ తో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications