హవ్వ! టీటీడీ వద్ద నిధుల్లేవట! వందల కోట్ల రూపాయలు ఏమౌతున్నట్లు?
తిరుపతిః ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం. నిత్యం లక్ష మందికిపైగా భక్తులు సందర్శించే పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల. వారంతపు రోజులు, పండుగలు, సెలవులు, బ్రహ్మోత్సవాల వంటి ప్రత్యేక సందర్భాల్లో శ్రీవారిని దర్శించే భక్తుల సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. అదే స్థాయిలో టీటీడీ ఆదాయమూ ఉంటుంది. భక్తులు హుండీలో వేసే కానుకల రూపంలో గానీ, టికెట్ల విక్రయాలు, భక్తులకు గదులను అద్దెకు కేటాయించడం వల్ల గానీ టీటీడీకి రోజూ లక్షలాది రూపాయల ఆదాయం అందుతుంది.
అలాంటి టీటీడీ వద్ద కొన్ని ప్రశ్నలకు నిధులు లేవనే సమాధానం వస్తోంది. అదీ- ఉద్యోగుల విషయంలోనే కావడం విమర్శలకు తావిస్తోంది. శాశ్వత ప్రాతిపదికన కాకుండా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఖాళీలను భర్తీ చేయడం వల్ల అన్యమతస్తులు టీటీడీలో ఉద్యోగాలు పొందడానికి అవకాశం ఏర్పడిందనే విమర్శలు తలెత్తుతున్నాయి.
తిరుమల తిరుపతి దేవస్థానంలో కొన్నేళ్లుగా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తోన్న ఉద్యోగులు, ఇతర సిబ్బందిని పర్మినెంట్ చేయడానికి బోర్డు అంగీకరించట్లేదు. దీనికి కారణం.. నిధులు లేవనే సాకు. నిధుల కొరతను ఎదుర్కొంటున్నామని స్వయంగా టీటీడీ బోర్డు ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ చెబుతున్నారు. ఇదే కారణంతో టీటీడీలో శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలను నియమించుకోవడానికి బోర్డు సుతారామూ అంగీకరించట్లేదు. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో బండిని లాగిస్తోంది టీటీడీ.
`క్రౌడ్ మేనేజ్మెంట్`లో టీటీడీ రోల్ మోడల్..
లక్షలాది మంది భక్తులు ఒకే చోట చేరుకున్నప్పటికీ.. వారికి ఏ మాత్రం ఇబ్బందులు కలగకుండా చూడటంలో టీటీడీ ఉద్యో్గులది కీలక పాత్ర. `క్రౌడ్ మేనేజ్మెంట్`లో టీటీడీకి ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే. ఎన్ని ప్రశంసలు కురిపించినా తక్కువే. క్రౌడ్ మేనేజ్మెంట్ విషయంలో టీటీడీ ఓ రోల్ మోడల్ అనడంలో సందేహాలు అక్కర్లేదు. రోజూ కనీసం లక్షమంది భక్తులకు టీటీడీ ఉద్యోగులు అలవోకగా వసతులు కల్పించగలుగుతారు. ఈ గొప్పతనమంతా ఉద్యోగులదే. అలాంటి ఉద్యోగులు టీటీడీ బోర్డు యాజమాన్యం నిర్లక్ష్యానికి గురవుతున్నారు.
టీటీడీ పరిధి పెరుగుతోంది. మరింత విస్తృతం అవుతోంది. అయినప్పటికీ.. శాశ్వత ప్రాతిపదికన అక్కడ ఉద్యోగాలను భర్తీ చేయట్లేదు బోర్డు యాజమాన్యం. ఆదాయ, వ్యయాల మధ్య లోటును తగ్గించడానికి టీటీడీ కాంట్రాక్టు ఉద్యోగుల వైపే మొగ్గు చూపుతున్నారని చెబుతున్నా, వాస్తవ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంటోంది.
అప్పట్లో అలా..ఇప్పుడు ఇలా
టీటీడీ లెక్కల ప్రకారం చూస్తే 1999లో టీటీడీలో ఉండే శాశ్వత ఉద్యోగుల సంఖ్య 16 వేలకు పైమాటే. అప్పట్లో శ్రీవారి దర్శనార్థం రోజూ తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య సుమారు 20 వేలు. ప్రస్తుత పరిస్థితులు దీనికి భిన్నంగా ఉన్నాయి. సాధారణ రోజుల్లోనే స్వామివారిని దర్శించడానికి వచ్చే భక్తుల సంఖ్య సుమారు లక్ష వరకు ఉంటోంది. ప్రత్యేక సందర్భాల్లో ఈ సంఖ్య లక్షన్నరకు తగ్గదు. భక్తుల తాకిడీకి అనుగుణంగా నివాస వసతిని టీటీడీ కల్పించిందేమో గానీ ఉద్యోగుల సంఖ్యను మాత్రం పెంచట్లేదు. ఈ విషయంలో ప్రభుత్వాలకు ధీటుగా వ్యవహరిస్తోంది టీటీడీ. శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగుల భర్తీకి మంగళం పలికింది. వాటి స్థానంలో కాంట్రాక్ట్ ఉద్యోగులను తీసుకుంటోంది. టీటీడీలో శాశ్వత ఉద్యోగుల సంఖ్య ఏడువేల లోపే. కాంట్రాక్ట్ ఉద్యోగులు మాత్రం 15 వేల మందికి పైగా ఉన్నారు. పదవీ విరమణ వల్ల ఏర్పడిన ఖాళీలను కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బందితో నింపేస్తోంది.
అన్య మతస్తులకు ఆస్కారం..?
దీని ప్రభావం టీటీడీ కార్యనిర్వహణపై తీవ్రంగా పడుతోంది. గతలో ఎప్పుడూ లేనివిధంగా ఉద్యోగులు పనిభారాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ పదేళ్ల కాలంలో టీటీడీ కార్యకలాపాలు భారీగా విస్తరించాయి. కొత్త ప్రదేశాల్లో స్వామి ఆలయాలను నిర్మించింది టీటీడీ. హర్యానాలోని కురుక్షేత్ర, తమిళనాడులోని కన్యాకుమారిలో కొత్తగా శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాలను నిర్మించింది. అమరావతి, భువనేశ్వర్, విశాఖపట్నం సహా మరిన్ని ప్రాంతాల్లో టీటీడీ శరవేగంగా శ్రీవారి ఆలయాల నిర్మాణ పనులను కొనసాగిస్తోంది.
ఇలా రోజురోజుకు టీటీడీ పరిధి పెరుగుతున్నా అందుకు అనుగుణంగా ఉద్యోగుల భర్తీపై మాత్రం టీటీడీ ఉన్నతాధికారులు దృష్టి పెట్టడం లేదు. ఆయా ఆలయాల నిర్వహణ బాధ్యత టీటీడీదే కావడం వల్ల కొత్త పోస్టులు ఏర్పడ్డాయి. వాటిని కూడా భర్తీ చేయట్లేదు. అప్పటికప్పుడు దొరికిన స్థానికులను కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించుకుని, చేతులు దులుపుకొంటోంది. ఆ స్థానికులు ఎలాంటి వారో, ఏ మతానికి చెందిన వారనే విషయాన్ని కూడా పట్టించుకోవట్లేదు. ఇలాంటి చో్ట అన్యమతస్తులు టీటీడీలో ఉద్యోగం పొందడానికి కారణమౌతోందనే ఆరోపణలు ఉన్నాయి.
లడ్డూ కౌంటర్ల వద్ద రద్దీ అందుకే!
రోజూ సుమారు లక్షమంది వరకు భక్తులు సందర్శించే తిరుమలలో వారికి సౌకర్యాలు కల్పించడంలో ఏర్పడుతున్న జాప్యానికి ఉద్యోగుల ఖాళీలే కారణం అవుతోందనే వాదన ఉంది. రోజూ వచ్చే లక్షమంది భక్తుల కోసం టీటీడీలో పాతిక వేల మంది ఉద్యోగులు కూడా లేరు. వారిలో 80 శాతం మంది కాంట్రాక్టు సిబ్బందే. ఫలితంగా- భక్తుల ఇక్కట్లు పెరుగుతున్నాయి. లడ్డూ కౌంటర్ల వద్ద రోజూ నెలకొనే భక్తుల రద్దీ దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా తీసుకోవచ్చు. స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం అదనంగా ప్రతి మనిషికి 10 లడ్డూలను ఇవ్వాల్సి ఉంది. శ్రీవారి పోటులో, బూందీ పోటులో లడ్డూల తయారీకి అనుగుణంగా ఉద్యోగులు లేరు. ఫలితంగా.. లడ్డూ కౌంటర్ల వద్ద క్యూ భారీగా పెరుగుతోంది. తోపులాట చోటు చేసుకుంటోంది.