తేదీలను ఖరారు చేసిన టీటీడీ
Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం నాడు 90,802 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 35,776 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 3.73 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. నారాయణగిరి షెడ్లు కూడా క్రిక్కిరిసిపోయాయి. అదనంగా షెడ్లను వేయాల్సి వచ్చింది. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 12 నుంచి 14 గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

వేసవి సెలవుల కారణంగా గత వారం రోజులుగా తిరుమలలో భక్తుల తాకిడి అనూహ్యంగా పెరిగింది. ఈ క్రమంలో అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. వైకుంఠం కంపార్టుమెంట్లు, నారాయణగిరి షెడ్లు, బయట క్యూలైన్లలో వేచి ఉన్న భక్తుల కోసం టీటీడీ నిరంతరాయంగా అన్నప్రసాదం, మంచినీటిని అందజేసే ఏర్పాట్లు చేసింది.
కాగా- ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థగా విరాజిల్లుతున్న టీటీడీ ఓ సరికొత్త ప్రాజెక్ట్ ను ప్రకటించింది. విద్యార్థులకు హిందూ సనాతన ధర్మం గురించి బోధించడం, వారిలో నైతిక విలువలను పెంపొందించాలనే ఉద్దేశంతో ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టనుంది.
దీని పేరు సద్గమయ. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి తేదీలను ఖరారు చేసింది టీటీడీ. టీటీడీ పాఠశాలల్లో ఈ నెల 16, 17, 18, 19 తేదీల్లో దీన్ని నిర్వహించనుంది. ఈ విషయాన్ని టీటీడీ కార్యనిర్వహణాధికారి జే శ్యామల రావు వెల్లడించారు. ఈ కార్యక్రమం అమలుపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
తొలిదశలో టీటీడీకి చెందిన ఏడు పాఠశాలలు- తిరుపతిలోని ఎస్జీఎస్ హైస్కూల్, ఎస్వీ ఓరియంటల్ హైస్కూల్, ఎస్వీ హైస్కూల్, ఎస్ కే ఆర్ ఎస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఎస్పీ బాలికల పాఠశాల, తిరుమలలోని ఎస్వీ హైస్కూల్, తాటితోపులోని ఎస్ కె ఎస్ హైస్కూల్ పిల్లలకు శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు.
7,8,9 తరగతుల విద్యార్థులకు భగవద్గీత సారాంశాన్ని పిల్లలకు అర్థమయ్యేలా, సరళమైన పదాలతో బోధిస్తారు. విద్యార్థులకు దైవభక్తి, నైతిక విలువలు, నిజాయితీ, క్రమశిక్షణ, సమాజం పట్ల బాధ్యత.. తదితర అంశాలపై శిక్షణ ఇవ్వడానికి సద్గమయ కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించామని శ్యామలరావు అన్నారు. దీనికి అవసరమైన 'సద్గమయ' మాడ్యూల్, లిటరేచర్ పుస్తకాలు అందించాలని అన్నారు.
శ్రీవారి వైభవాన్ని యువత, పిల్లలకు మరింతగా తెలిసేలా శిక్షణ ఉండాలని శ్యామలరావు అన్నారు. సనాతన ధర్మం విలువలను పాఠశాల దశలోనే అలవాటు చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని పేర్కొన్నారు. చిన్న వయసు నుండే సనాతన ధర్మం, ఉమ్మడి కుటుంబం, తల్లి, తండ్రి, గురువు, దైవం, సమాజం, దేశం గొప్పతనాన్ని తెలియజేసే అంశాలకు ప్రాముఖ్యత ఇవ్వాలని శ్యామలరావు సూచించారు.












Click it and Unblock the Notifications